ఇంట్లో రక్తం మరక కనిపించటంతో పదిరోజుల క్రితం చనిపోయిన మహిళ మృతిపై కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో వెంటనే పోలీసులకు కంప్లైంట్ చేశారు. అనుమానస్పదమృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూడ్చిపెట్టిన శవాన్ని బయటకు తీసి మళ్లీ పోస్టుమార్టం నిర్వహించారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హబ్షీపూర్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బైండ్ల బాలవ్వ(52)కు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. అందరికీ వివాహాలయ్యాయి. కుమారులూ ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. భర్త కొన్నేళ్ల క్రితమే చనిపోవటంతో గ్రామంలో ఒంటరిగా ఉంటూ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తుంది. అయితే ఈనెల 7న బాలవ్వ ఇంట్లో కింద పడి మృతి చెందిన స్థితిలో ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. నిద్రలో పడిపోయి చనిపోయిందేమోనని అందరూ భావించారు. అనంతరం పది రోజుల క్రితమే అంత్యక్రియలు చేసేశారు.
అయితే అంత్యక్రియలు జరిగిన మరుసటి రోజు ఇంట్లో గోడలపై, ఇతర చోట్ల రక్తం మరకలను కుటుంబీకులు గుర్తించారు. బాలవ్వ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ.. దుబ్బాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆదివారం ఎమ్మార్వో జయంత్ ఆధ్వర్యంలో మృతదేహాన్ని పూడ్చి వేసిన ప్రాంతంలోనే పంచనామా నిర్వహించారు. సిద్దిపేట ఫోరెన్సిక్ వైద్యులు, సిబ్బంది ఆధ్వర్యంలో పోస్టుమార్టం చేశారు. అనంతరం మృతదేహాన్ని మళ్లీ పూడ్చేశారు. ఇంటి పక్కనే ఉండే ఓ యువకుడిపై కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేశారు. అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.