ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఆరు' నూరైనా హామీలు అమలు చేసి తీరుతాం: రాహుల్ గాంధీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 17, 2023, 08:52 PM

తెలంగాణలో త్వరలో వచ్చే ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ పథకాలను ప్రకటించింది. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో నిర్వహించిన విజయభేరి సభలో పాల్గొన్న అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే.. తెలంగాణ ప్రజల కోసం ప్రత్యేక పథకాలను ప్రకటించారు. ఆరు గ్యారంటీ పథకాలతో పాటు పలు కీలక హామీలు కూడా ఇచ్చార సోనియా గాంధీ. అనంతరం ప్రసంగించిన రాహుల్ గాంధీ.. ఈ సభా వేదికగా ఆరు హామీలు ఇస్తున్నామని.. అధికారంలోకి వచ్చాక వాటిని ఆరు నూరైనా అమలు చేసిన తీరుతామని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ ఎలా ఇచ్చిందో.. అదే విధంగా రాష్ట్రంలో అధికారంలోకి రాగానే హామీలను కూడా అమలు చేస్తామని రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు.


తెలంగాణ సర్కారు అవినీతిలో కూరుకు పోయిందని రాహుల్ గాంధీ విమర్శించారు. రానున్న రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని.. అది ఖాయమని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు ఎన్ని రకాలుగా అడ్డుకోవాలని చూసినా.. తమను అధికారంలోకి రాకుండా ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. ఈ మూడు పార్టీలు.. రోజులు లెక్కపెట్టుకోవాల్సిందేనంటూ గట్టిగానే తన గళాన్ని వినిపించారు. నరేంద్ర మోదీ కనుసైగ చేయగానే బీజేపీ, ఎంఐఎం పార్టీలు పార్లమెంటులో అన్ని బిల్లులకు మద్దతు ఇస్తున్నాయని రాహుల్ చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పైకి విడివిడిగా కనిపిస్తున్నా.. వాళ్లు ముగ్గురూ ఒక్కటేనన్నారు.


కేవలం ఒక్క కుటుంబం కోసమే సోనియా గాంధీ.. తెలంగాణ ఇవ్వలేదన్నారు రాహుల్. రైతులు, మహిళలు, విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం తెలంగాణ ఇచ్చారన్నారు. తెలంగాణ ఏర్పడిన ప్రతిఫలం అంతా కేసీఆర్‌ కుటుంబమే అనుభవిస్తోందని మండిపడ్డారు. వంద రోజుల్లో బీఆర్ఎస్ సర్కారును గద్దె దించడం ఖాయమన్నారు. తొమ్మిదేళ్ల బీఆఱ్ఎస్ పాలనలో పేదలకు ఎలాంటి మేలు జరగలేదని దుయ్యబట్టారు. తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమ కారులకు 250 గజాల ఇంటి స్థలంతో పాటు ఇల్లు కూడా ఇస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు.


మోదీ ప్రభుత్వం గ్యాస్‌ సిలిండర్‌ను వెయ్యి రూపాయలు చేసిందని.. కానీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పేదలకు రూ.500లకే ఇస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు. మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు. యువ వికాసం కింద యువతకు కాలేజీ, కోచింగ్‌ ఫీజు కోసం రూ.5లక్షల వరకు ఇస్తాన్నారు. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ.10లక్షల బీమా సదుపాయం కల్పిస్తామని చెప్పుకొచ్చారు. రైతు భరోసా పథకం ద్వారా ఎకరాకు రూ.15 వేలు సాయం అందిస్తామన్నారు. చేయూత పింఛను ద్వారా రూ.4 వేలు అందిస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం రూ.5 లక్షల చొప్పున ఇస్తామంటూ.. తెలంగాణ ప్రజలపై హామీల వర్షం కురిపించారు రాహుల్ గాంధీ.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com