తనను పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి మోసం చేశాడంటూ ఓ మహిళ రోడ్డుపై పోరాటానికి దిగింది. ఇందులో వింతేముంది.. అలా చాలా మంది మోసపోయి ధర్నాలకు దిగుతుంటారు కదా అనుకోవచ్చు. కానీ.. అసలు విషయం ఏంటంటే.. ఆ పోరాటం చేస్తున్న మహిళకు ఇప్పటికే పెళ్లయింది. ఆ పెళ్లి జరిగి కూడా ఆరేళ్లయింది. అంతేకాదు.. మూడేళ్ల కొడుకు కూడా ఉండటం గమనార్హం. అయితే.. ఈ ప్రియుడు మధ్యలో రాలేదండోయ్. పెళ్లికి ముందే ఆమెకు ఓ లవ్ స్టోరీ ఉంది. వాళ్లది ఆరేళ్ల ప్రేమ అంట మరి..! ఈ విచిత్ర ఘటన... నల్గొండ జిల్లా వేములపల్లి మండలంలోని ఆమనగల్లులో చోటుచేసుకుంది.
వేములపల్లి మండలంలోని రావులపెంటకు చెందిన తరికొప్పుల శిరీష, ఆమనగల్లుకు చెందిన మహేష్ గత ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కాగా.. వీళ్లిద్దరి ప్రేమాయణం శిరీష ఇంట్లో తెలియడంతో.. వెంటనే అంటే ఐదేళ్ల క్రితమే ఆమెకు కుటుంబ సభ్యులు వేరే వ్యక్తితో పెళ్లి చేసేశారు. వివాహం జరిగినప్పటికీ.. శిరీష, మహేష్ మధ్య ఉన్న ప్రేమ మాత్రం దూరం కాలేదు. వాళ్ల ప్రేమాయణాన్ని కొనసాగిస్తూనే వచ్చారు. ఈ క్రమంలోనే.. శిరీషకు కొడుకు కూడా జన్మించాడు. ఆ అబ్బాయికి ప్రస్తుతం మూడేళ్లు.
రోజులు గడుస్తున్నా.. వాళ్లిద్దరి మధ్య ప్రేమ అలాగే కొనసాగుతూ వస్తోంది. శిరీషకు తన భర్తతో ఉండటం ఇష్టం లేదని.. తన దగ్గరి వచ్చేస్తానని ప్రియున్ని చాలా సార్లు అడిగింది. దానికి.. తన భర్త నుంచి విడాకులు తీసుకుని వస్తే పెళ్లి చేసుకుందామని ప్రియుడు చెప్తూ వచ్చాడు. తన ప్రియుడి మాట విని.. శిరీష తన భర్త నుంచి విడిపోయి దూరంగా ఉంటుంది. అంతా తాను చెప్పినట్టే చేసిన శిరీషకు.. తన ప్రియుడు మహేశ్ చివర్లో ట్విస్ట్ ఇచ్చాడు. తన భర్తను వదులుకుని వచ్చిన శిరీషతో పెళ్లికి మహేష్ నిరాకరిస్తున్నాడు.
ఇదే విషయమై శిరీష.. పెద్ద మనుషులను ఆశ్రయించినప్పటికీ ఎవ్వరూ పట్టించుకోలేదు. దీంతో.. మహేష్ స్వగ్రామమైన ఆమనగల్లుకు వెళ్లి.. తనను పెళ్లి చేసుకోవాలంటూ భీమారం- సూర్యాపేట రహదారిపై ధర్నాకు దిగింది. అయితే.. శిరీష తన భర్తతో లీగల్గా విడాకులు తీసుకోలేదని.. తెలుస్తోంది. మరి.. ఈ విషయం తెలిసి పెద్ద మనుషులంతా ఇదెక్కడి లొల్లి తల్లి.. అంటూ తల బాదుకుంటున్నారు. మరి శిరీషకు ఎలాంటి న్యాయం జరుగుతుందో చూడాలి.