తెలంగాణలో వర్షాలపై భారత వాతావరణశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. అక్టోబర్ 1వ తేదీ వరకు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు పూర్తిగా వెళ్లిపోకముందే సెప్టెంబర్లో హైదరాబాద్, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పారు. రాబోయే కొద్ది రోజుల్లో సాధారణ వర్షపాతం నమోదవుతుందన్నారు. సెప్టెంబర్ 21 నుండి రుతుపవనాలు పుంజుకుని నెలాఖరు వరకు చురుకుగా ఉంటాయన్నారు. అక్టోబర్ మొదటి వారం వరకు వర్షాలు కొనసాగుతాయని భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
సెప్టెంబర్ 22 మరియు 28 మధ్య రాష్ట్రంలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని అన్నారు. అదే వాతావరణంతో అక్టోబర్ 5 లేదా 6 వరకు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. నైరుతి రుతుపవనాలు అక్టోబర్ 6 నుంచి 12 మధ్య ఉపసంహరించుకునే అవకాశం ఉందన్నారు. ఈ మధ్య కాలంలో తెలంగాణలో చాలా తక్కువ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ సూచించింది. సెప్టెంబర్ 21 వరకు తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ఏర్పడే అవకాశం ఉందన్నారు. ప్రారంభంలో ఉత్తర బంగాళాఖాతం వైపు పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతుందని దీని ప్రభావంతో 22 నుంచి 28 మధ్య వర్షాలు కురుస్తాయన్నారు.
ఇప్పటివరకు తెలంగాణలోని రెండు జిల్లాల్లో రికార్డు స్థాయిలో అధిక వర్షపాతం నమోదైందన్నారు. 9 జిల్లాల్లో అధిక వర్షపాతం, 11 జిల్లాల్లో సాధారణ వర్షపాతం, 8 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది వెల్లడించారు. మూడు జిల్లాల్లో గత వారం రోజులుగా భారీ వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. ప్రస్తుతం పసిఫిక్ ప్రాంతంలో బలహీనమైన ఎల్నినో పరిస్థితులు నెలకొని ఉన్నాయన్నారు. ఇవి వచ్చే ఏడాది ప్రారంభం వరకు కొనసాగుతాయని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. రాబోయే రెండు రోజుల్లో హైదరాబాద్లో చాలా తేలికపాటి నుండి తేలికపాటి వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఇతర జిల్లాల్లోనూ వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్పారు.