నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. పోలీసులు గౌరవ వందనం స్వీకరించిన సీఎం.. జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో సీఎం ప్రసంగించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత హైదరాబాద్ సంస్థానం 1948 సెప్టెంబర్ 17న భారత్లో భాగమైందన్నారు. దాంతో తెలంగాణలో రాజుల పాలన ముగిసిందని.. అందువల్లే రాష్ట్రవ్యాప్తంగా ఈ వేడుకలు జరుగుతున్నాయన్నారు.
తెలంగాణలో చాలా పోరాటాలు జరిగాయన్న సీఎం కేసీఆర్... వారు చేసిన త్యాగాలు, పోరాటాలను ఎప్పటికీ గుర్తుంచుకుంటామన్నారు. వారందరికీ నివాళులు అర్పిస్తున్నానన్నారు. గాంధీ, నెహ్రూ, సర్ధార్ వల్లాభాయ్ పటేల్ వల్లే తెలంగాణ దేశంలో అంతర్భాగమైందని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ సాకారంతో తన జన్మ ధన్యమైందని చెప్పారు. 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి.. స్వరాష్ట్రంలో పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారా. జాతీయ సమైక్యతకు దేశం నిలయంగా ఉందని.. అయితే ఆర్థిక సమస్యలు, పేదరికం వంటివి ఇప్పటికీ సవాళ్లు విసురుతున్నాయన్నారు. ప్రభుత్వ పథకాలతో అన్ని రంగాలూ అభివృద్ధి చెందేలా చేస్తున్నామన్నారు. ఇప్పుడు తెలంగాణ ఆచరిస్తున్నదని.. దేశం అనుసరిస్తుందని కేసీఆర్ అన్నారు.
1956లో తెలంగాణ ప్రజల ఇష్టాలకు వ్యతిరేకంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైందన్న కేసీఆర్... ఉమ్మడి ఏపీలో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత.. సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేశామన్నారు. అంతకుముందు గన్పార్కులో అమరవీరులకు సీఎం ఘనంగా నివాళులు అర్పించి పుష్పాంజలి ఘటించారు. ఇక జిల్లాల్లో మంత్రులు, ప్రభుత్వ విప్లు తెలంగాణ జాతీయ సమైక్యతా ఉత్సవాల్లో పాల్గొన్నారు. జాతీయ జెండా ఎగురవేసి.. తెలంగాణ సాయుదపోరాట యోధులను స్మరించుకున్నారు.