సంసారంలో గొడవల కారణంగా ఓ తల్లి దారుణానికి ఒడిగట్టింది. తన నలుగురు పిల్లలను కాలువలో పడేసింది. ఆపై తానూ ఆత్మహత్యకు యత్నించింది. ఈ విషాదకర ఘటన నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగనూరు గ్రామానికి చెందిన శరవంద, ఎర్రగుంట తండాకు చెందిన లలిత (33) 8 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు మహాలక్షి (5), సాత్విక (4), మంజుల (3)తో పాటు మార్కండేయ (7 నెలల) అనే బాబు ఉన్నారు. కాగా, భార్య భర్తల మధ్య ఇటీవల గొడవలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో తాను కల్లు తెచ్చుకుంటానని లలిత భర్తను అడిగింది. అయితే అతను వద్దని వారించటంతో మనస్థాపానికి గురైన లలిత భర్త తనను వేధిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు తన నలుగురు పిల్లలతో సహా పోలీస్ స్టేషన్కు వెళ్లింది. అయితే స్టేషన్లో కంప్లైంట్ తీసుకునే అధికారి రాలేదని కాసేపు ఆగాలని కానిస్టేబుల్స్ లలితకు చెప్పి అక్కడే కూర్చొబెట్టారు. అయితే పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారని.. వారికి తినిపించి మళ్లీ వస్తానని చెప్పి స్టేషన్ నుంచి బయటకు వెళ్లింది. అక్కడ నుంచి స్టేషన్కు కొద్ది దూరంలో ఉన్న కేఎల్ఐ కాలువ దగ్గరికి వెళ్లి.. నలుగురు పిల్లలను నీళ్లల్లోకి తోసేసింది. ఆపై తాను దూకేందుకు ప్రయత్నించగా.. గమనించిన స్థానికులు అడ్డుకున్నారు. పిల్లలను కాపాడేందుకు కాల్వలోకి స్థానికులు దిగినా.. ఫలితం లేకుండా పోయింది. ముగ్గురు ఆడపిల్లలు మరణించగా.. ఏడు నెలల మార్కండేయ గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు లలితను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.