బరేలీ : ప్రధాని నరేంద్ర మోదీ ర్యాలీలో పాల్గొన్న ఓ ముస్లిం మహిళకు తన భర్త విడాకులు ఇచ్చేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీలో చోటు చేసుకుంది. గుజరాత్ ఎన్నికల్లో భాగంగా ప్రధాని మోదీ శనివారం నిర్వహించిన ర్యాలీలో ఫయ్రా అనే ముస్లిం మహిళ పాల్గొంది. త్రిపుల్ తలాఖ్పై చట్టం చేస్తామని మోదీ చెబుతున్న నేపథ్యంలో ఆయనకు మద్దతుగా ర్యాలీలో పాల్గొన్నట్లు ఫయ్రా తెలిపింది. ర్యాలీ నుంచి తిరిగి ఇంటికి వచ్చిన తనకు తన భర్త విడాకులు ఇచ్చాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. త్రిపుల్ తలాఖ్ విషయంలో మోదీ ఏం చేయలేడని తన భర్త చెప్పినట్లు వెల్లడించింది. తాము ఎప్పుడైనా త్రిపుల్ తలాఖ్ చెప్పొచ్చని భర్త చెప్పాడని బాధితురాలు వాపోయింది. తన భర్తకు అతని ఆంటీతో వివాహేతర సంబంధాలున్నాయని తెలిపింది. నన్ను, నా కుమారుడిని తీవ్రంగా కొట్టి ఇంటి నుంచి గెంటేశాడని ఫయ్రా కన్నీరు పెట్టుకుంది. దీనిపై భర్త డానిష్ స్పందిస్తూ.. తన భార్యకు త్రిపుల్ తలాఖ్ చెప్పలేదని పేర్కొన్నాడు. ఆవిడకు వివాహేతర సంబంధం ఉండటంతోనే విడాకులు ఇచ్చానని స్పష్టం చేశారు. మోదీ ర్యాలీలో పాల్గొన్నందుకు తాను విడాకులు ఇవ్వలేదని తెలిపాడు.