ఇటీవల మధ్యప్రదేశ్లో ఓ యువతిపై సామూహిక అత్యాచారం ఘటన మర్చిపోకముందే ఆ రాష్ట్రంలో మరో దారుణం చోటుచేసుకుంది. సాగర్ జిల్లా దేవల్ గ్రామంలో తన ఇంట్లో నిద్రపోతున్న ఓ మైనర్ యువతి(15)పై ఇద్దరు దుండగులు గురువారం రాత్రి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె సాయం కోసం అరవడంతో సదరు యువతిపై దుండగులు కిరోసిన్ పోసి నిప్పంటించారు.
ప్రస్తుతం 80 శాతం కాలిన గాయాలతో బాధితురాలు ఇక్కడి బుందేల్ఖండ్ వైద్యకళాశాల, ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని సబ్ ఇన్స్పెక్టర్ మహేంద్రసింగ్ ధాకడ్ తెలిపారు. ఈ దుర్ఘటన సమయంలో బాలిక తల్లి ఇంట్లోలేదన్నారు. బాధితురాలి తండ్రి కొనేళ్లక్రితమే చనిపోయాడన్నారు. బాలిక తాత ఇంటిబయటే నిద్రపోతున్నప్పటికీ.. ఆయనకు చెవులు విన్పించకపోవడంతో ఈ దుర్ఘటన జరిగిందన్నారు. ఈ దారుణానికి పాల్పడ్డ నిందితుడు సర్వేష్ సేన్(21)ను అదుపులోకి తీసుకున్నామనీ.. మరో మైనర్ నిందితుడు పరారీలో ఉన్నాడనీ జిల్లా సూపరింటెండెంట్ ఎస్.శుక్లా తెలిపారు. నిందితులపై ఐపీసీ సెక్షన్ 376(డి), పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.