అమరావతి:ప్రజలకు ప్రయోజనం కలిగించేలా మనం వ్యవహరించాలని సీఎం చంద్రబాబు అన్నారు. మన వల్ల ఎంత మేలు జరిగితే అంత తృప్తి ఉంటుందని ఆయన తెలిపారు. గ్రామాల్లో అన్ని మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. ప్రత్యేక హోదా కోసం కొంతమంది చలో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టారని, హేదుబద్ధత లేని విభజన చేశారని మొదట్నుంచీ చెబుతున్నానని ఆయన పేర్కొన్నారు. శాసనసభలో సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి ఇంటికి తాగునీటి సరఫరా కోసం రూ.22వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని ఆయన వివరించారు. వీలైనంత త్వరలో సిమెంట్ రహదారుల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించనున్నట్లు పేర్కొన్నారు. ఏమీ చేయకుండానే అన్ని రహదారులు వేశామని గత ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది, మళ్లిd ఇప్పుడు కేంద్రం నుంచి ఒక్కొక్కటిగా నిధులు సేకరిస్తున్నామన్నారు. ఎక్కువ పనులు చేసినప్పుడు కలిగే సంతోషమే వేరు, అందరూ ప్రజలకు సేవ చేస్తూనే ఉండాలన్నారు. ఈ ఏడాది నుంచే పొలాలకు రహదారులు వేసే కార్యక్రమం చేపడుతామని సీఎం తెలిపారు. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునే దుర్మార్గపు చర్యలకు వైసీపీ పాల్పడుతోందని, రాష్ట్ర ప్రజలు వైసీపీ నేతలను ఎట్టిపరిస్థితుల్లో క్షమించరని ఆయన అన్నారు. ఉపాధి హామీ నిధులతో అన్ని గ్రామాల్లో పంచాయతీ భవనాలు నిర్మించనున్నట్లు, క్రీడా మైదానాలు అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. పశువులకు దాణా భద్రత కల్పించామని సీఎం పేర్కొన్నారు. 2018నవంబర్ నాటికి 30లక్షల ఎల్ఈడీ దీపాలు ఏర్పాటు చేస్తామని సీఎం చెప్పారు. శాశ్వతంగా ప్రజల గుండెల్లో ఉండేలా పనిచేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.