జమ్ము: జమ్ముకశ్మీర్ పోలీసులకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, జాకెట్స్ అందనున్నాయి. ఎక్కువ మంది పోలీస్ సిబ్బంది ఉగ్రవాద ముప్పు ఉన్న ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న నేపథ్యంలో వారి ప్రాణ రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను మంజూరు చేసినట్లు పోలీస్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కశ్మీర్ లోయలో ఈ ఏడాది ఉగ్రవాదులు జరిపిన దాడుల కారణంగా 26 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.
పోలీస్ సిబ్బంది ప్రాణ రక్షణ కోసం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను అన్ని పోలీస్ స్టేషన్లకు, సీనియర్ అధికారులకు మంజూరు చేసింది. వీటితో పాటు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్, టోపీలు కూడా సిబ్బందికి అందనున్నాయి. సుమారు 150 వాహనాలను అందించనున్నట్లు జమ్ముకశ్మీర్ డీజీపీ ఎస్పీ వైద్ వెల్లడించారు. జమ్ముకశ్మీర్ పోలీసుల ఆధునికీకరణ కోసం రూ.500కోట్ల నిధులను విడుదల చేస్తున్నట్లు గతంలో ప్రధాని మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే.