రోజుకు 15 గంటల వెట్టిచాకిరి చేయిస్తున్న యజమాని నుంచి పిల్లలు సహా 42 మంది కార్మికులకు సోమవారం విముక్తి లభించింది. వీరిని చిత్తూరు ఆర్డీవో రేణుక తన కార్యాలయానికి పిలిపించి విచారించగా. వారు తమ ఆవేదన వెళ్లగక్కారు. చిత్తూరు మండలం ఇరువారం వద్ద ఇనయతుల్లా తన ఇటుక బట్టీలో పనిచేసేందుకు కార్మికుల కోసం ఒడిశా రాష్ట్రం బలంగీర్ జిల్లాకు చెందిన ఓ మధ్యవర్తితో మాట్లాడారు. 11 కుటుంబాలకు చెందిన 27 మందికి ఒక్కొక్కరికి రూ. 32 వేలు చెల్లించి తీసుకొచ్చారు. వీరితో పాటు 15 మంది చిన్నపిల్లలున్నారు. వారానికి రూ. 300 మాత్రమే ఇవ్వడంతో తమకు సరిపోయేది కాదని కార్మికులు ఆవేదన చెందారు.
రోజుకు 15 గంటల పాటు పనిచేయించే వాడని, అనారోగ్యం వచ్చినా ఆస్పత్రికీ తీసుకెళ్లడని, పిల్లల చేతా పని చేయించేవాడని ఆర్డీవో ఎదుట విలపించారు. వీరికి అంబేడ్కర్ భవనంలో బస, ఆహారం ఏర్పాటు చేసి మంగళవారం సొంతూర్లకు పంపించనున్నట్లు ఆర్డీవో తెలిపారు. అనంతరం ఇనయతుల్లాను ఆర్డీవో విచారించారు. అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు తహసీల్దార్ చిట్టిబాబు, ఏవో రామాంజనేయులు, ఆర్ఐ ధనంజయలు పాల్గొన్నారు.