తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శించుకోవాలనుకునే భక్తుల కోసం టీటీడీ శుభవార్త తెలిపింది. గత రెండేళ్లుగా కరోనా కారణంగా దర్శనాల విషయంలో ఆంక్షలు విధిస్తూ వచ్చిన టీటీడీ తాజాగా పరిస్థితులు మెరుగుపడడంతో టికెట్ల కోటాను పెంచుతోంది. మొన్నటి వరకు తక్కువ సంఖ్యలో టికెట్లను విడుదల చేస్తూ వచ్చిన అధికారులు ఇప్పుడు భారీగా టికెట్లను కేటాయిస్తారు. ఈ క్రమంలోనే సోమవారం ఏప్రిల్ నెల కోటాకు సంబంధించి ప్రత్యేక దర్శన టికెట్లను విడుదల చేసిన టీటీడీ, నేడు మే నెల కోటాను విడుదల చేయనుంది. ఉదయం 9 గంటలకు టీటీడీ టికెట్లను విడుదల చేయనున్నారు. సోమవారం నుంచి బుధవారం వరకు రోజుకు 30 వేల టికెట్లు, గురువారం నుంచి ఆదివారం వరకు రోజుకు 25 వేల టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంచనున్నారు. ఇక రేపు (బుధవారం) జూన్ నెల కోటా టికెట్లు విడుదల చేయనున్నారు.