గోవా కాంగ్రెస్ అధ్యక్షుడు గిరీష్ చోడంకర్ తన పదవికి రాజీనామా చేశారు. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, దాని మిత్ర పక్షం గోవా ఫార్వార్డ్ పార్టీ (జిఎఫ్పి) 11 సీట్లు గెలుచుకోగా, బిజెపి 20 సీట్లను గెలుచుకున్న సంగతి తెలిసిందే.దీంతో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ.. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. గిరీష్ చోడంకర్ తన రాజీనామాను ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఎఐసిసి) కార్యాలయానికి పంపినట్లు గోవా ఎఐసిసి డెస్క్ ఇన్చార్జ్ దినేష్ గుండూరావ్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ గెలుపు కోసం తీవ్రంగా కృషి చేశారు. అయినప్పటికీ పార్టీ అన్ని స్థానాల్లోనూ విజయావకాశాలు దక్కించుకోలేకపోయింది. కాగా, చోడంకర్ రాజీనామాను పార్టీ అధిష్టానం ఆమోదించనుందని, ఆయన స్థానంలో మరో వ్యక్తిని నియమించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సంకల్ప్ అమోంకర్, అలెక్సో సిక్వేరియా , ఎల్విన్ గోమ్స్ల పేర్లు వినిపిస్తున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి.