తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో జరిగే ధర్నాకు బయలుదేరిన అంగన్వాడీ, ఆశావర్కర్లు, మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. ఆదివారం ఉదయం డి. హిరేహాల్, రాయదుర్గం పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. సాయంత్రం వరకూ స్టేషన్లోనే ఉంచారు. పలువురు సీఐటీయూ నాయకులు, విద్యార్థి సంఘ నాయకులను కూడా అదుపులోకి తీసుకున్నారు. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు విజయవాడ కు వెళుతున్న వారిని అక్రమంగా స్టేషన్ కు తీసుకెళ్లారని సిఐటియు నాయకులు మల్లికార్జున, నాగరాజు మండిపడ్డారు. కొద్దిమంది అనారోగ్యంతో బాధపడుతున్నట్లు చెప్పినా వినిపించుకోలేదన్నారు. అరెస్టయిన వారిలో అంగన్వాడీ యూనియన్ నాయకురాలు రాధ మద్యాహ్న బోజన పథకం కార్మికుల యూనియన్ నాయకులు తిమ్మరాజు, ఆశావర్కర్ల యూనియన్ అధ్యక్షురాలు పద్మావతి తదితరులు ఉన్నారు.