తనను చంపుతామంటూ బెదిరిస్తున్నారంటూ ప్రముఖ సామాజిక కార్యకర్త అంజలి దమానియా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం నుంచి తనకు ఈ కాల్స్ వచ్చాయని ఆమె ముంబైలోని వకొల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బీజేపీ నేత ఏక్ నాథ్ ఖడ్సేపై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని... లేకపోతే చావు తప్పదని బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు వచ్చిన ఫోన్ కాల్ పాకిస్థాన్ నుంచి వచ్చిందని... నంబరు దావూద్ ఇబ్రహీం పేరిట ఉందని తెలిపారు. తన భర్తతో చాటింగ్ చేస్తున్న సమయంలో, అర్ధరాత్రి దాటిన తర్వాత 12.33 గంటలకు ఈ ఫోన్ వచ్చిందని ఆమె తెలిపారు. ట్రూకాలర్ లో ఆ నంబర్ దావూద్ ఇబ్రహీంకు చెందనదిగా చూపించిందని చెప్పారు. ట్రూకాలర్ స్క్రీన్ షాట్ ను కూడా తీసి ఆమె ట్విట్టర్లో పోస్ట్ చేశారు.