చంద్రగిరి మండలంలో జగనన్న కాలనీల పేరుతో వైసీపీ నాయకులు ఇసుక దందా కొనసాగిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికార యంత్రాంగం మాత్రం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తొండవాడ సమీపంలో తిరుపతి రూరల్ మండలం, చంద్రగిరి, తొండవాడ, శానంబట్ల పంచాయతీల్లోని అర్హులైన వారికి జగనన్న కాలనీల్లో ఇళ్ల పట్టాలిచ్చారు.
ప్రధానంగా తొండవాడ సమీపంలోని జగనన్న కాలనీలో సుమారు ఎనిమిది వేల మందికి పైగా ఇంటి పట్టాలిచ్చారు. ఇక్కడ ఇంటి నిర్మాణాలు చేపట్టడానికి అవసరమైన ఇసుక, కంకర, ఇటుక, సిమెంటు సరఫరా చేయడానికి వైసీపీ నాయకులకు అధికారులు బాధ్యతలు అప్పగించారు. దీంతో జగన్న కాలనీ పేరుతో స్వర్ణముఖినది నుంచి ఇసుకను టిప్పర్ల ద్వారా తీసుకెళ్లి ట్రాక్టర్ ఇసుకను సుమారు రూ. వెయ్యి నుంచి రూ. 1500 వరకు విక్రయిస్తున్నారు. లబ్ధిదారుల్లో చాలామందికి సొంత ట్రాక్టర్లు ఉన్నా తమ ఇంటి నిర్మాణానికి అవసరమైన ఇసుకను వైసీపీ నాయకుల వద్దే కొనుగోలు చేయాలని అధికారులు హుకుం జారీ చేయడంపై విమర్శలొస్తున్నాయి. పైగా ఇతరులెవరైనా ఇసుకను తరలిస్తే వారి ట్రాక్టర్లను సీజ్ చేసి, కేసులు పెడుతున్నారు.
దీనిపై తహసీల్దార్ శిరీషను వివరణ కోరగా జగనన్న కాలనీల్లోని లబ్ధిదారులకు అవసరమైన ఇసుక తరలించడానికి వైసీపీ నాయకులకు అనుమతి ఇచ్చామన్నారు. ట్రాక్టర్లు ఉన్నవారు ఇసుకను అక్రమంగా వేరే నిర్మాణాలకు తరలిస్తున్నారన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.