ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శంబర పోలమాంబ అమ్మవారి జాతర ప్రారంభం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 25, 2022, 11:55 AM

విజయనగరం: ఉత్తరాంధ్రుల ఆరాధ్యదేవతగా పేరొందిన ప్రఖ్యాతిగాంచిన శంబర పోలమాంబ అమ్మవారి సిరిమానోత్సవం ప్రారంభమైంది. విజయనగరం జిల్లా మక్కువ మండలం శంబరలో వెలసిన పోలమాంబ అమ్మవారి జాతర 3 రోజుల పాటు ఘనంగా జరుతుంది.


శంబర పోలమాంబ జాతరలో సోమవారం తొలేళ్లు, మంగళవారం సిరిమానోత్సవం, బుధవారం అంపకోత్సవం జరుగనున్నాయి. జాతరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. దర్శనానికి వచ్చే వారికి రెండు మాస్క్‌లు తప్పనిసరి చేశారు. ప్రతి ఏటా ధనుర్మాసం ప్రారంభం రోజున పెదపోలమాంబ జాతర ప్రకటిస్తారు. వారం రోజులు ఘటాలను శంబరలో ఉంచి పూజలు చేస్తారు. పెదపోలమాంబ అంపకోత్సవం రోజున పోలమాంబను గ్రామంలోకి తీసుకెళ్లడం ఆనవాయితీ.


ప్రతి ఏటా జనవరి చివరివారంలో జరిగే ఈ గిరిజన వేడుకకు ఇరుగుపొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. ప్రతి ఏటా సంక్రాంతి పండుగ రోజుకు ముందు వచ్చే మంగళవారం గ్రామదేవత పోలమాంబను గ్రామంలోనికి తీసుకువస్తారు. పోలమాంబ శంబర గ్రామంలో పుట్టిపెరిగినందున గ్రామస్తులంతా పోలమాంబను తమ ఇంటి ఆడపిల్లగా భావిస్తారు.


సంక్రాంతి పండుగకు ప్రతి ఆడపిల్ల పుట్టింటికి వెళ్లే ఆనవాయితీ ఉంటుంది కనుక పోలమాంబ అమ్మవారిని సంక్రాంతి రోజుకు ముందు వచ్చే మంగళవారం గ్రామంలోనికి తీసుకువస్తారు. సంక్రాంతి పండుగ తరువాత వచ్చే మంగళవారం అమ్మవారికి పూజలు నిర్వహించి ఆ తరువాత వచ్చే మంగళవారం అమ్మవారి సిరిమానోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు ఉత్తరాంధ్రతో పాటు ఒడిశా, ఛత్తీస్ గఢ్‌, మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున భక్తులు సిరిమానోత్సవంలో పాల్గొంటారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com