గుంటూరు: ఆటో బోల్తా పడి ఉపాధ్యాయిని ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెల్లంకొండ కస్తూర్బా బాలికా విద్యాలయం ఉపాధ్యాయిని కట్టా జ్ఞానమ్మ(35) భర్త విజయ్ కుమార్తో కలిసి ఆదివారం సత్తెనపల్లి వెళ్లారు. ఆటోలో తిరిగి బెల్లంకొండ బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న వాహనం రెడ్డిగూడెం దాటగానే ఎదురుగా వస్తున్న లారీ బంపర్ తగలడంతో అదుపు తప్పి బోల్తా పడింది. సంఘటనలో జ్ఞానమ్మకు తీవ్ర గాయాలు కాగా స్థానికుల సాయంతో భర్త ఆమెను హుటాహుటిన సత్తెనపల్లి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆటోలో చోదకునితో సహా మరో ఇద్దరు ఉండగా వారికి స్వల్ప గాయాలయ్యాయి. ఎస్సై కలగొట్ల అమీర్ సంఘటన జరిగిన తీరును పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.