ఏపీ సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి లకు సీబీఐ కోర్టులో ఊరట లభించింది. జగన్, విజయసాయిరెడ్డి ల బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామ కృష్ణరాజు వేసిన పిటిషన్ ను సీబీఐ కోర్టు కొట్టివేసింది. అక్రమాస్తుల కేసుకు సంబంధించి ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా సాక్షులను ప్రభావితం చేస్తున్నారనే ఆరోపణలతో జగన్, విజయసాయిరెడ్డిల బెయిల్ రద్దు చేయాలని రఘురామకృష్ణరాజు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అక్రమాస్తుల కేసుపై సీబీఐ న్యాయస్థానంలో గత రెండు మూడు నెలలుగా సుదీర్ఘ విచారణ జరిగింది.
బెయిల్ మంజూరు చేసిన సందర్భంలో సీబీఐ కోర్టు విధించిన షరతులను జగన్, విజయసాయిరెడ్డి ఉల్లంఘించారని.. అందువల్ల వారి బెయిల్ రద్దు చేయాలని రఘురామకృష్ణరాజు తరఫు న్యాయవాదులు వాదించారు. అయితే తాము ఎలాంటి షరతులు ఉల్లంఘించలేదని, కేవలం రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కోసమే రఘురామ పిటిషన్ దాఖలు చేశారని జగన్ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం రఘురామరాజు పిటిషన్ ను కొట్టేసింది. సీబీఐ కోర్టు తీర్పుపై హైకోర్టుకు వెళ్లనున్నట్లు ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు.