తన కారును ఢీకొట్టాడన్న కారణంగా అధికార పార్టీకి చెందిన నేత ఒకరు రోగితో వెళ్తున్న అంబులెన్స్ అడ్డగించారు. దీంతో ఆస్పత్రికి వెళ్లడం ఆలస్యం కావడంతో రోగి మృతికి కారణమయ్యారు. దీంతో రోగి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హరియాణాలో ఈ సంఘటన చోటుచేసుకుంది.
ఇక్కడి ఫతేబాద్కు చెందిన భాజపా కౌన్సిలర్ నాగ్పాల్ ప్రయాణిస్తున్న కారును రోగితో వెళ్తున్న అంబులెన్స్ శనివారం సాయంత్రం ట్రాఫిక్లో ఢీకొట్టింది. తన కారును ఢీకొట్టిన అంబులెన్స్ సదరు కౌన్సిలర్ వెంబడించి, సుమారు అర్ధగంట పాటు అడ్డగించారని బాధితుడి తరఫు బంధువులు ఆరోపించారు. తనకు జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారని తెలిపారు. చివరికి ఆస్పత్రికి వెళ్లే సమయానికి బాధితుడు నవీన్సోనీ (42) మృతిచెందాడని అతడి సోదరుడు సీతరాం సోనీ తెలిపారు. ఒక 15 నిమిషాలు మందు తెచ్చి ఉంటే ప్రాణాలు కాపాడేవారమని వైద్యులు చెప్పారని తెలిపారు. రోగి మృతికి కారణమైనసదరు నేతపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీనిపై కౌన్సిలర్ నాగ్పాల్ స్పందిస్తూ తన వాహనాన్ని అంబులెన్స్ గుద్దిన మాట వాస్తవమేనని, అయితే అంబులెన్స్ను అడ్డగించలేదని పేర్కొన్నారు. రోగితో వెళ్తున్న అంబులెన్స్ను తాను ఎలా ఆపుతానని, అక్కడ ఉన్న వారిని ఎవర్ని అడిగినా చెప్తారని పేర్కొన్నారు. దీనిపై పోలీసులు స్పందిస్తూ భాజపా నేతపై వచ్చిన ఫిర్యాదు వాస్తవమేనని, ఇరు వర్గాల వారిని పోలీస్స్టేషన్ పిలిపించినట్లు తెలిపారు.