ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇండియాలో కరోనా శాశ్వతంగా ఉండే ఛాన్స్!

national |  Suryaa Desk  | Published : Wed, Aug 25, 2021, 11:27 AM

ఇండియాలో కరోనా ఇక ఎప్పటికీ ఉండే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్ఓ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ అంచనా వేశారు. ఇండియాలో కరోనా స్థానిక స్థాయికి చేరినట్లు కనిపిస్తోందని ఆమె అన్నారు. అంటే ఏదైనా వ్యాధి విదేశాల నుంచి వస్తే అది కొన్నాళ్లకు వెళ్లిపోతుంది. అలా కాకుండా ఇలా స్థానిక స్థాయికి చేరితే ఇక ఆ వ్యాధి ఎప్పటికీ పోదు. జలుబు, జ్వరం, దగ్గు ఎలాగైతే రెగ్యులర్‌ గా ఉంటాయో అలాగే కరోనా కూడా ఉంటుంది.


ఇండియా ఎపిడమిక్ స్టేజ్‌ని ఎప్పుడో దాటేసిందని, ఇప్పుడు స్థానిక స్థాయికి చేరిందని డాక్టర్ సౌమ్య అంటున్నారు. ఇండియాలో ప్రస్తుతం కరోనా తక్కువగానే ఉందని, ఇదివరకటిలా భారీగా కేసులు రావట్లేదని ఆమె అన్నారు. భారతీయులకు ఇమ్యూనిటీ వచ్చినట్లేనా అనే అంశంపై కూడా ఆమె మాట్లాడారు. ఇండియా చాలా పెద్ద దేశం కాబట్టి అంతటా ఒకేలా ఉండే అవకాశం లేదని ది వైర్ వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సౌమ్య అభిప్రాయపడ్డారు.


2022 చివరి నాటికి ప్రపంచ దేశాలు 70 శాతం ప్రజలకు వ్యాక్సిన్ వేయగలిగితే ప్రజల జీవితాలు సాధారణ స్థితికి వస్తాయని ఆమె అభిప్రాయపడ్డారు. పిల్లలకు కరోనా సోకే అవకాశం ఉన్నా వారిలో లక్షణాలు పెద్దగా కనిపించడం లేదని చెప్పారు. అలాగే జ్వరం వంటివి చాలా తక్కువ మందికే వస్తున్నాయని ఆమె తెలిపారు. ఆస్పత్రుల్లో మాత్రం పిల్లల కోసం రెడీగా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.


థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని, అందుకు సిద్ధంగా ఉండాలన్నారు. వ్యాక్సినేషన్ లో మూడో డోస్ అనేది సైంటిఫిక్‌గా మంచి పద్ధతి కాదన్నారు. ఈ విషయంలో తొందరపడొద్దని, రెండు డోసులకే సరిపెట్టడం మేలన్నారు. తద్వారా వ్యాక్సిన్లు అందని దేశాలకు అదనపు వ్యాక్సిన్లను పంపిణీ చేయవచ్చు అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com