నంద్యాల: నంద్యాలలో వైకాపా ఆధ్వర్యంలో గురువారం నిర్వహించనున్న బహిరంగ సభలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొంటున్నట్లు పార్టీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఎస్పీజీ మైదానంలో మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించే బహిరంగ సభలో ఆయన మాట్లాడతారని తెలిపారు.
స్థానిక వైకాపా కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో బొత్స మాట్లాడారు. మూడేళ్లు నంద్యాల గురించి పట్టించుకోని తెదేపా నాయకులు ఉప ఎన్నికల నేపథ్యంలో దొంగ ప్రేమ చూపిస్తున్నారని ఆరోపించారు. శిల్పా సొసైటీ పేరుతో తన సొంత డబ్బులతో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారని పేర్కొన్నారు. వైకాపా ఎప్పుడూ ప్రజలకు హామీ ఇస్తుందే, తప్ప నాయకులకు హామీ ఇవ్వదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పార్టీ నాయకుడు అంబటి రాంబాబు మాట్లాడుతూ... డబ్బులు, పదవులు ఇచ్చి నాయకులను పార్టీలోకి ఆహ్వానించే కార్యక్రమం తెదేపాలోనే జరుగుతుందని, వైకాపాలో ఉండదన్నారు. జగన్ను చూసి అందరూ పార్టీలో చేరుతున్నారని పేర్కొన్నారు.