రాష్ట్ర ప్రజలు ప్రతిపక్షాన్ని ఎప్పుడో మర్చిపోయారని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఆయన శు క్రవారం టెక్కలిలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం కృష్ణదాస్ మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాలు, రైతు దినోత్సవానికి లభిస్తున్న ప్రజాదరణచూసి ప్రతిపక్ష టీడీపీ నాయకులకు కాళ్లూ, చేతులూ ఆడడం లేదని అన్నారు. టీడీపీ హయాంలో వ్యవసాయం దండగ అనే విధంగా రైతు వ్యతిరేకవిధానాలను అవలంబించి అన్నదాతలను వారు మోసం చేశారని అన్నారు. వ్యవసాయాన్ని ఒక పండగలా నిర్వహించుకోవడం ఎలా ఉంటుందో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సాధించి చూపించారని అన్నారు. రూ.75 లక్షలతో నిర్మించిన ఈ డిసిసిబి బ్యాంకులో కార్పొరేట్ బ్యాంకులకు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో పలు విభాగాలున్నాయన్నారు. రూ1400కోట్లు వార్షిక టర్నోవర్ డిసిసిబి ముందుకు సాగుతుండడం అభినందనీయమన్నారు. అతి త్వరలో అన్ని మండలాల్లోనూ డిసిసిబి బ్రాంచ్లు ఏర్పాటవుతున్నాయని తెలిపారు. ఇప్పటికే ఈ జిల్లాలో డిసిసిబికి 20 ఏటీఎమ్ కేంద్రాలున్నాయని వీటిని మరింతగా విస్తరిస్తామని అన్నారు. కార్పొరేట్ బ్యాంకులకు దీటుగా అతి సులభంగా లావాదేవీలు నిర్వహించుకునేలా తీర్చిదిద్దిన డిసిసిబి శాఖలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, సీఈఓ దత్తి సత్యనారాయణ, మాజీ చైర్మన్ డోల జగన్, వ్యవసాయ సలహా మండలి చైర్మన్ కరిమి రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.