బెంగళూరు: బెంగళూరులో నగరంలో చైనా పౌరుడిపై ఐదుగురు దుండగులు దాడికి పాల్పడటం కలకలం రేపింది. ఈ ఘటన శనివారం చోటు చేసుకుంది. ఓ బిజినెస్ డీల్ కుదుర్చుకునేందుకు యాన్ అనే చైనా పౌరుడు బెంగళూరుకు వచ్చాడు.
ఇందిరానగర్లో క్యాబ్ కోసం వేచి చూస్తున్నాడు. ఇంతలో ద్విచక్రవాహనాలపై వచ్చిన ఐదుగురు వ్యక్తులు యాన్ వద్ద ఉన్న వస్తువులను దోచుకెళ్లడానికి ప్రయత్నించారు. యాన్ ప్రతిఘటించడంతో కత్తులతో అతని ముఖంపై దాడి చేశారు.వారి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించిన యాన్.. సాయం కోసం కేకలు వేశాడు. దీంతో దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘర్షణలో యాన్ ముఖానికి గాయమైంది. ఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు ఆయన్ను ఆసుపత్రికి తరలించారు.