ఫరీద్కోట్: పట్టపగలు నడిరోడ్డుపై ఓ వ్యాపారిని దారుణంగా హత్య చేశాడో వ్యక్తి. తన సొంత మిల్లు ముందే కారును పార్క్ చేస్తుండగా.. మరో కారులో వచ్చిన దుండగుడు వ్యాపారిపై వరుస కాల్పులు జరిపాడు. అనంతరం తాపీగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. పంజాబ్లోని ఫరీద్కోట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
స్థానిక పారిశ్రామికవేత్త రవీంద్ర పప్పు కొచ్చర్ ఆదివారం తన మిల్లుకు కారులో బయల్దేరాడు. మిల్లు గేటు ముందు కారును పార్క్ చేస్తుండగా.. ఆ వెనుకే కొచ్చర్ను ఫాలో అవుతూ మరో కారు వచ్చి ఆగింది. అందులో నుంచి ఓ వ్యక్తి కిందకు దిగాడు. కొచ్చర్ అతడిని గమనించేలోపే తుపాకీ తీసుకుని నాలుగు సార్లు కాల్చాడు. ఆ తర్వాత మళ్లీ వెనక్కి వచ్చి మరోసారి కాల్చాడు. అనంతరం కారెక్కి వెళ్లిపోయాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కొచ్చర్ అక్కడికక్కడే మృతిచెందాడు.
స్థానిక సీసీటీవీ కెమెరాల్లో ఈ ఘటన రికార్డవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ హత్య చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కారులో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు వీడియో ద్వారా తెలుస్తోంది. కారును గుర్తించామని దాని కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో కొచ్చర్ను కొందరు దుండగులు డబ్బుకోసం బెదిరించారు. కొచ్చర్ నిరాకరించడంతో అదే మిల్లు ముందు గాల్లోకి కాల్పులు జరిపి.. అతడి కారును ఎత్తుకెళ్లారు. అప్పుడు కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గుర్ని అరెస్టు చేశారు. తాజాగా జరిగిన హత్య కూడా ఆ నిందితులే చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.