భారత ప్రభుత్వం బీఎస్ 4 వాహనాల పై నిషేధం విధించిన విషయం తెలిసిందే. కాలుష్యం తగ్గించే యోచనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. బీఎస్ 4 వాహనాలకు బదులు మార్కెట్లోకి బీఎస్ 6 వాహనాలను అనుమతించింది. కేంద్రం ఆదేశాల ప్రకారం టూవీలర్ కంపెనీలన్ని బీఎస్6 వాహనాలను అమ్ముతున్నాయి. కొన్ని కంపెనీలు ఇప్పటికే తయారు చేసిన బీఎస్4 వాహనాలను తక్కువ రేటుకు అమ్ముకున్నాయి.2020 మార్చి 31 తర్వాత బీఎస్4 వాహనాలను అమ్మవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. కానీ లాక్ డౌన్ వల్ల అన్ని వాహనాలను అమ్ముకోలేకపోయామని కంపెనీలు చెప్పడంతో మరో 10 రోజులు సుప్రీం కోర్టు బీఎస్4 వాహనాలను అమ్ముకోవడానికి అనుమతి ఇచ్చింది. కానీ మొత్తం అమ్మకాల్లో 10శాతం మాత్రమే బీఎస్4 వాహనాలు ఉండాలని తెలిపింది. కానీ ఈ నిబంధనను పక్కన పెట్టి చాలా కంపెనీలు ఎక్కువ మొత్తంలో బీఎస్4 వాహనాలను అమ్మాయి. దీని పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికి కూడా బీఎస్4 వాహనాల రిజిస్ట్రేషన్ కొనసాగుతుండడంతో అసంతృప్తి వ్యక్తం చేసింది.తక్షణమే బీఎస్4 వాహనాల రిజిస్ట్రేషన్ ఆపాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఎవరైనా సెకండ్ హ్యాండ్ వెహికిల్ కొనుక్కుంటే అది BS4 మోడల్ అయితే దాన్ని తమ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకోలేరు. పాత వారి పేరు ఉంచాలి. అలా వేరే వారి పేరు మీద ఉన్న వాహనం నడపడం నేరం. దీని పై మరోసారి ఆగష్టు 13న సుప్రీంకోర్టు విచారణ జరపనుంది.