ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నెరవేరనున్న ఆరు దశాబ్దాల కల: రాయలసీమలో సంబరాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 01, 2020, 06:03 PM

కర్నూలు జిల్లాలో సందడి నెలకొంది. ఆరు దశాబ్దాల కల నెరవేరబోతుందంటూ జిల్లా వాసులు సంబరాలు చేసుకుంటున్నారు. మూడు రాజధానులు బిల్లుకు గవర్నర్‌ బిశ్వభూషన​ హరిచందన్‌ ఆమోదం తెలపడంతో జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. న్యాయ రాజధాని కర్నూలును ప్రకటించడం పట్ల సీఎం జగన్ కు జిల్లా వాసులు ధన్యవాదాలు తెలిపారు. యావత్ రాయలసీమ ప్రాంత వాసులు దశాబ్దాల కాలంగా ఎదురుచూస్తున్న శ్రీబాగ్ఒడంబడిక అమలు కాబోతున్న సందర్భంలో రాయలసీమ ప్రజల ఆనందాలకు అడ్డే లేకుండా పోయింది.కర్నూలుకు హైకోర్టు సాధన కోసం ఏళ్ల తరబడి పోరాటం చేస్తున్నారు. అప్పట్లో ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా ఉన్నటువంటి కర్నూలు విడిపోయిన తర్వాత న్యాయ రాజధానిగా ప్రకటించారు. అనంతరం జగన్ అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులు ఉండాలని అసెంబ్లీలో ప్రకటించారు. అసెంబ్లీ, పరిపాలనా విభాగం, న్యాయ రాజధానులుగా మూడు విభాగాలుగా విభజించడంతో దాదాపు 6నెలలపాటు పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లు ఇటీవలే గవర్నర్ వద్దకు వెళ్లడం.. ఆమోదించడం ఇవన్నీ జరిగిపోయాయి. అంతేకాదు కర్నూలుకు న్యాయ రాజధాని రావడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.కర్నూలు అత్యంత వెనుకబాటుకు గురైంది ఇప్పుడు న్యాయ రాజధాని కర్నూలుకు రాబోతున్న సందర్భంలో అనేక రకాలుగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఉమ్మడి రాజధానిగా మద్రాస్ నుంచి విడిపోయిన తర్వాత కర్నూలు రాజధానిగా ఉంది. తెలుగు ప్రజలంతా ఒకే విధంగా ఉండాలి, కలిసి ఉండాలనే నమ్మకంతో ఆనాడు విడిపోయిన సందర్భంగా హైదరాబాద్ కు రాజధాని వెళ్లింది. శ్రీబాగ్ ఒడంబడిక ఒప్పందం ప్రకారం కర్నూలుకు రాజధానైనా ఇవ్వాలి లేకపోతే న్యాయశాఖ హైకోర్టు ఇవ్వాలని అనేక సంవత్సరాలు నుండి డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన వికేంద్రీకరణ అంశం ఆధారంగా మూడు రాజధానులు ప్రకటించారు. ఆ బిల్లు అసెంబ్లీ నుంచి శాసనమండలికి వెళ్లడంతో మండలిలో ప్రతిపక్ష సభ్యులు ఎక్కువగా ఉండటంతో బిల్లును అడ్డుకోవడం జరిగింది. దాంతో గవర్నర్ దగ్గరకు పంపారు. గవర్నర్ శుక్రవారం సీఆర్డీఏ బిల్లు రద్దు చేసి మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రకటిస్తూ బిల్లుకు ఆమోద ముద్ర వేయడంతో రాయలసీమ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఇదిలా ఉంటే మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో కర్నూలు నడిబొడ్డున గల కొండారెడ్డి బురుజుతోపాటు యావత్ రాయలసీమ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. ఎన్నో ఏళ్లుగా చేస్తున్న పారాటానికి నేడు ప్రతిఫలం లభించిందని ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు తెలిపారు. కర్నూలును న్యాయ రాజధానిగా ఎంపిక చేసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే సీఎం జగన్‌ లక్ష్యమని కొనియాడారు. న్యాయ రాజధాని కర్నూలుకు రావాలన్నది తమ కల అని అరవై ఏండ్లనాటి తమ కల నెరవేరబోతున్నందుకు సంతోషంగా ఉందన్నారు.కర్నూలులో హైకోర్టు ఏర్పాటు వల్ల రాయలసీమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు ఆలూరు రామిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రాయలసీమలో జ్యూడిషియల్ క్యాపిటల్ స్వాగతిస్తున్నామన్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు వల్ల రాయలసీమకు న్యాయం జరుగుతుందని, మూడు రాజధానుల వల్ల ప్రాంతీయ అసమానతలు ఉండవని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు అభిప్రాయపడ్డారు. పరిపాలన వికేంద్రీకరణ బిల్లుకు, సీఆర్ డీఏ చట్టం రద్దుకు రాష్ట్ర గవర్నర్ ఎంపీ సంజీవ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు.గవర్నర్ బీబీ హరిచందన్, సీఎం జగన్ కి ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి సైతం హర్షం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా ఉన్నటువంటి కర్నూలు విడిపోయిన తర్వాత న్యాయ రాజధానిగా ప్రకటించడం హర్షించదగ్గ విషయమన్నారు. రాయలసీమ ప్రాంతానికి ఇదొక వరమని కొనియాడారు. రాయలసీమ ప్రజల చిరకాల ఆకాంక్షను సీఎం జగన్ నెరవేర్చారని మాజీ ఎంపీ బుట్టా రేణుక అన్నారు. రాయలసీమ ప్రజల మనోభవాలకు పెద్దపీట వేసిన జగన్ కు బుట్టా రేణుక ధన్యవాదాలు తెలిపారు.ఇకపోతే రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు ఏపీ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. గవర్నర్ ఆమోదంతో ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు కానున్నాయి. పాలనా రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. అయితే కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించడం పట్ల కర్నూలుతోపాటు రాయలసీమ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com