నేపాల్లో భారత టీవీ ఛానెళ్ల ప్రసారాలు నిలిచిపోయాయి. నేపాల్ కొత్త మ్యాప్ విషయంలో ఇటీవల నేపాల్, భారత్ మధ్య చోటు చేసుకున్న వివాదం, అక్కడి రాజకీయ పరిణామాల నేపథ్యంలో నేపాల్ కేబుల్ ఆపరేటర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. తమ దేశంలో దూరదర్శన్ మినహా భారత టీవీ ఛానెళ్లన్నింటినీ నిలిపివేస్తున్నట్లు నేపాల్ కేబుల్ ఆపరేటర్లు గురువారం ప్రకటించారు. ఇందులో ప్రభుత్వ ప్రమేయం ఏమీ లేదని, తాము స్వచ్ఛందంగా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. భారత టీవీ ఛానెళ్లలో తమ దేశానికి, దేశ ప్రధాని కేపీ శర్మ ఓలీకి వ్యతిరేకంగా కార్యక్రమాలు ప్రసారమవుతున్నాయని, నేపాలీల ఆత్మ గౌరవానికి విలువ ఇవ్వాల్సిన బాధ్యత తమపై ఉందని కేబుల్ ఆపరేటర్లు పేర్కొన్నారు. పాకిస్థాన్, చైనాకు చెందిన టీవీ ఛానెళ్ల ప్రసారాలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.