ఢిల్లీ నిజాముద్దీన్లోని తబ్లీఘీ జమాత్ మర్కజ్...! ఈ ప్రాంతం ఇప్పుడు భారత్లో కరోనా ఎపిక్ సెంటర్గా మారిపోయింది. ఇక్కడ మతపరమైన ప్రార్థనల్లో పాల్గొన్నవారిలో చాలా మందికి కరోనా వైరస్ సోకింది. దేశం నలుమూలల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున ఇక్కడి ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం తమ తమ సొంతూళ్లకు వెళ్లిపోయారు. ఇందులో తెలుగు రాష్ట్రాల వారు కూడా ఉన్నారు. వీరంతా ఢిల్లీ నుంచి ఎలా వెళ్లారు? ఎక్కడెక్కడికి వెళ్లారు? ఎవరెవరిని కలిశారన్న దానిపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఈ క్రమంలోనే బుధవారం అన్ని రాష్ట్ర ప్రభుత్వాల సీఎస్లు, డీజీపీలతో కేంద్ర కేబినెట్ సెక్రటరీ వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. మర్కజ్ కేసులకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేశారు.మర్కజ్ ప్రార్థనలకు హాజరైన వారిని తక్షణం గుర్తించి.. వారు ఎవరెవరిని కలిశారో ట్రేస్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఆదేశించింది. యుద్ధప్రాతిపదికన ఈ చర్యలు చేపట్టాలని లేదంటే కోవిడ్-19 మరింత వేగంగా విస్తరించే అవకాశముందని సూచించింది.ఢిల్లీలో తబ్లీఘీ జమాత్కు హాజరైన విదేశీయులు వీసా నిబంధనలను ఉల్లంఘించారని కేంద్రం గుర్తించింది. వీసా నిబంధనలను ఉల్లంఘించిన విదేశీయులతో పాటు జమాత్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.లాక్డౌన్ నేపథ్యంలో పేదలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు వెంటనే ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన అమలును రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ప్రారంభించాలి. నగదు పంపిణీ సమయంలో సామాజిక దూరం పాటించేలా పకడ్బందీగా చర్యలు చేపట్టాలి.దేశమంతటా లాక్డౌన్ పకడ్బందీగా అమలవుతోందని చెప్పిన కేంద్రం... నిత్యావసరా సరుకులను రవాణా చేసే వాహనాలకు ఇబ్బందులు లేకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.నిత్యావసర వస్తువుల ఉత్పత్తి ఎక్కడా ఆగిపోకుండా చర్యలు తీసుకోవాలి. అలాగే వాటి సప్లయ్ చైన్ ఆగిపోకుండా చూడాలి. లేదంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశముందని.. అలా జరగకుండా చూడాలని స్పష్టం చేసింది.