వైసీపీ నియంతృత్వ పోకడలను ప్రజాక్షేత్రంలో ఎండగడతామని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు అన్నారు. రేపటి నుంచి 45 రోజుల పాటు జరగనున్న ప్రజా చైతన్య యాత్ర కరపత్రాలను మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆయన విడుదల చేశారు. ఈ యాత్రను తెదేపా అధినేత చంద్రబాబు ప్రకాశం జిల్లా నుంచి ప్రారంభించనున్నట్లు చెప్పారు. వైసీపీ 9 నెలల పాలన 9 పద్దులు, 9 భారాలతో గడిచిందని ఎద్దేవా చేశారు. ప్రజలకు ఉపయోగపడే మంచి పథకాలనూ రద్దు చేశారని ఆరోపించారు. ఆర్టీసీ, విద్యుత్, పెట్రో ఛార్జీలను పెంచారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటికే అర్హుల పింఛన్లు తొలగించారని.. మరిన్ని తొలగించేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. అధికార పార్టీ నేతలు బలవంతంగా జె-ట్యాక్స్ వసూలు చేస్తున్నారని విమర్శించారు. జె-ట్యాక్స్ కింద అధికార పార్టీకి రూ. 20 వేల కోట్ల ఆదాయం వస్తోందన్నారు.