మ్మూ కాశ్మీర్లో ముగ్గురు ఉగ్రవాదులను భారత ఆర్మీ మట్టుబెట్టింది. బుధవారం నాడు తెల్లవారు జామున జరిగిన ఎదురు కాల్పుల్లో ముష్కరులను సైనికులు అంతమొందించారు. కాశ్మీర్లోని పుల్వామా జిల్లా త్రాల్ సెక్టార్లో ఉన్న దైవర్ గ్రామంలో ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతా దళాలను గమనించిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. వెంటనే అప్రమత్తమైన సైనికులు.. ఎదురు కాల్పులు జరిపి వారిని మట్టుబెట్టారు. ఉగ్రవాదుల మృతదేహాలను స్వాధీనం చేసుకొని, వివరాలు సేకరిస్తున్నారు.
కాగా, మృతులు స్థానిక ఉగ్రవాదులేనని, ఘటనా స్థలిలో పేలుడు పదార్థాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు సైనికాధికారులు వెల్లడించారు. ఆ ప్రాంతంలో ఇంకా ఉగ్రవాదులెవరైనా ఉన్నారన్న అనుమానంతో తనిఖీలను కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు.