క్రికెటర్లకు సమస్య వచ్చినప్పుడు ప్రతీ ఒక్కరూ తమ పునరావసంలో జాతీయ క్రికెట్ అకాడమీకి (ఎన్సీఏ)లోనే శిక్షణ తీసుకోవాలని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ స్పష్టం చేశాడు. తాజాగా జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో సౌరవ్ గంగూలీ ఈ విషయాన్ని స్పష్టం చేశాడు. "నేను ద్రవిడ్ను నిన్న కలిశాను. ఎన్సీఏలో మేము ఒక పద్ధతి రూపొందించాం. భారత క్రికెటర్ల ఎవరికైనా చికిత్స-శిక్షణ అవసరమైతే ఎన్సీఏకే వెళ్లాలి. ఇక్కడ కారణం ఏదైనా, గాయపడ్డ ఆటగాళ్ల పర్యవేక్షణ బాధ్యత ఎన్సీఏదే. అక్కడ అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తాం. ఆటగాళ్లు ఇబ్బందికి గురికాకుండా సౌకర్యవంతంగా ఉండేలా చూస్తాం" అని గంగూలీ అన్నాడు. "చికిత్స కోసం శిక్షణ కోసం బయట ఫిజియోలను సంప్రదించడం సరైనది కాదు. కొత్త ప్రదేశంలో ప్రస్తుతం ఎన్సీఏలో నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి. మేం మరో 18 నెలలు ఉంటే.. అత్యాధునిక వసతులు, టెక్నాలజీ ఉన్న సరికొత్త ఎన్సీఏని చూస్తారు" అని సౌరవ్ గంగూలీ చెప్పుకొచ్చాడు. ఇటీవల బుమ్రాకు ఫిట్నెస్ పరీక్ష నిర్వహించేందుకు ఎన్సీఏ తిరస్కరించిన సంగతి తెలిసిందే. వెన్ను గాయం నుంచి కోలుకున్న అతను పునరాగమనం చేయాలంటే ఎన్సీఏలో ఫిట్నెస్ టెస్టు పాస్ కావాల్సిందే. ఈ టెస్టు రిపోర్టు ఆధారంగానే సీనియర్ సెలెక్షన్ కమిటీ ఎంపిక ప్రక్రియపై నిర్ణయం తీసుకుంటుంది. గాయం నుంచి కోలుకునేందుకు బుమ్రా ఎన్సీఏను కాదని, తన పునరావాసాన్ని తను చూసుకున్నాడు. అయితే, అతనెలా పురోగతి సాధించాడో తెలియకుండా, అతడిని సమీక్షించకుండా ఫిట్నెస్ టెస్టు నిర్వహించడం కుదరదని రాహుల్ ద్రవిడ్ తేల్చి చెప్పాడు. బుమ్రాకు టెస్టు నిర్వహించడం లేదని టీమిండియా అసిస్టెంట్ ట్రెయినర్ యోగేశ్ పర్మార్కు స్పష్టం చేసినట్లు తెలిసింది. దీనిపై బీసీసీఐ అధ్యక్ష హోదాలో సౌరవ్ గంగూలీ కూడా సీరియస్గా దృష్టి సారించడంతో నేరుగా ద్రవిడ్నే కలిశాడు. దీనిపై గురువారం ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో రాహుల్ ద్రవిడ్తో మాట్లాడిన తర్వాత సౌరవ్ గంగూలీ మరోసారి వివరణ ఇచ్చాడు. అదే సమయంలో నాలుగు దేశాల మధ్య నిర్వహించే 'వన్డే సూపర్ సిరిస్'పై మాట్లాడుతూ అది కేవలం ప్రతిపాదన అని చెప్పుకొచ్చాడు.