2012లో ఢిల్లీలో జరిగిన ఘటనలో తమకు ఇంకా న్యాయం జరుగలేదనే నిర్భయ తల్లి ఆశాదేవి ఆవేదన వ్యక్తం చేశారు. నలుగురు హంతకులకు ఉరి శిక్ష విధించి తమకు న్యాయం చేయాలని నిర్భయ తల్లి ప్రభుత్వాన్ని, న్యాయవ్యవస్థను వేడుకొన్నారు. ఏడేళ్ల క్రితం తన కూతురు నిర్భయ అత్యాచారం, హత్యకు గురైన విషయాన్ని మరోసారి మీడియా ముందు ప్రస్తావించారు. జాతీయ మీడియాతో మాట్లాడుతూ కంటతడి పెట్టుకొన్నారు. మహిళ భద్రతపై జాతీయ మీడియా ఛానెల్ నిర్వహించిన చర్చలో ఆశాదేవి మాట్లాడుతూ.. గత ఏడేళ్లుగా నా బిడ్డకు జరిగిన అన్యాయం గురించి న్యాయ పోరాటం చేస్తున్నాను. 2012లో ఎలా ఉందో పరిస్థితి ఇప్పుడు కూడా అలానే ఉంది. న్యాయం కోసం ఏళ్లుగా ప్రాధేయపడుతున్నాను. ఈ పోరాటంలో నా జీవితమే ప్రశ్నార్థకమైంది అని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యాచారానికి గురైన బాధిత కుటుంబాలు ఎంత క్షోభను అనుభవిస్తారో మాటల్లో చెప్పలేమన్నారు. నా కూతురు బతికి లేకపోవడం కొన్నిసార్లు చాలా సంతోషంగా ఉంటుంది. కోర్టులో దోషులను చూసినప్పుడుల్లా గుండె పగిలినంత బాధ కలుగుతుంది. నా బిడ్డ బతికి లేకపోవడం వల్ల అలాంటి మృగాలను చూసే దౌర్భగ్యం తప్పింది. అలాంటి వారిని చూసిన ప్రతీ రోజు నేను చచ్చిపోయినంత పని అవుతుంది అని ఆశాదేవి అన్నారు. ఆశాదేవి పోరాటానికి బాసటగా నిలుస్తానని, ఆమె ఆవేదనను అర్ధం చేసుకోగలనని ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుస్మిత దేవ్ అన్నారు. ఇది సామాజికపరమైన సమస్య. మహిళలు, పురుషుల అంతా సమానమేనని రాజ్యాగం చెబుతుంది. కానీ వాస్తవ పరిస్థితి చూస్తే భూమ్యాకాశాలకు ఉన్నంత తేడా ఉంది అని సుస్మిత దేవ్ పేర్కొన్నారు.