ఆదివారం చెన్నై చెపాక్ స్టేడయంలో జరిగిన తొలి వన్డేలో వెస్టిండీస్ 8 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు షిమ్రోన్ హెట్మెయిర్ (106 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్సర్లతో 139 పరుగులు) సెంచరీ చేయడంతో టీమిండియా మ్యాచ్ ఓడిపోయింది. హెట్మెయిర్ భారీ షాట్లతో విరుచుకుపడడంతో భారత బౌలర్లు ఏ దశలోనూ మ్యాచ్ను కాపాడలేకపోయారు. తొలి వన్డేలో ఓ ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఓ శునకం హఠాత్తుగా మైదానంలోకి దూసుకురావడంతో మ్యాచ్కు కాసేపు అంతరాయం ఏర్పడింది. భారత్ ఇన్నింగ్స్ 27వ ఓవర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో శ్రేయాస్ అయ్యర్, రిషభ్ పంత్ క్రీజులో ఉన్నారు. కీమో పాల్ బౌలింగ్ వేసేందుకు సిద్ధమయ్యాడు. పాల్ బంతిని వేస్తుండగా.. అయ్యర్ బ్యాట్ పట్టుకుని స్ట్రైకింగ్లో ఉన్నాడు. సరిగ్గా అదే సమయంలో భద్రతా అధికారుల నుండి తప్పించుకొని ఓ శునకం మైదానంలోకి దూసుకొచ్చింది. ఇది గమనించిన ఆటగాళ్లు చూస్తూ ఉండిపోయారు. వెంటనే అప్రమత్తమైన గ్రౌండ్ సిబ్బంది శునకంను పట్టుకునేందుకు మైదానంలోకి వచ్చారు. ఇక బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న విండీస్ ఆటగాళ్లు కూడా శునకంను తరిమేందుకు దాని వెంటపడ్డారు. దీంతో కాసేపు మ్యాచ్కు అంతరాయం ఏర్పడింది. ఆ తర్వాత భద్రతా సిబ్బంది దానిని బయటకు పంపడంతో మ్యాచ్ తిరిగి మొదలైంది. ఈ ఘటనతో స్టేడియంలోని ప్రేక్షకులు కాసేపు సందడి చేశారు. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే ఈ వీడియోను ఎంతోమంది వీక్షించారు.