శ్రీకాకుళం ఎచ్చెర్ల ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన వల్ల ఎక్కువ నష్టం ఐటీ కే అని, 98శాతం ఐటీని వదులుకొని కేవలం 2శాతం తో కొత్త రాష్ట్రంలోకి వచ్చామన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ట్రిపుల్ ఐటీలో నాణ్యతను పూర్తిగా పెంచుతామన్నారు. అదనపు సిబ్బందిని నియమిస్తామని తెలిపారు. పరిశ్రమల్లో స్థానికులకే ఉపాధి లభించాలనే ఉద్దేశంతో అసెంబ్లీలో కొత్త చట్టం చేశామన్నారు. ట్రిపుల్ ఐటీ విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచుతామని చెప్పుకొచ్చారు. పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేస్తామన్నారు. ఫీజుల నియంత్రణకు రెగ్యూలేటరీ కమిషన్ తీసుకువస్తామని చెప్పారు. ప్రతి ఏటా జనవరి ఒకటిన ప్రభుత్వ ఉద్యోగాల నియామక క్యాలెండర్ను ప్రకటిస్తామన్నారు. వ్యవస్థలో మార్పులు తీసుకువస్తామని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు.