ముంబయి : మహారాష్ట్రలోని ధూలే జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. నీమ్గల్ గ్రామ సమీంపలో షాహాడ - దొండైచ రహదారిపై జరిగిన రోడ్డుప్రమాదంలో 15 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. కంటైనర్, మహారాష్ట్రకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో రెండు వాహనాల డ్రైవర్లు ఉన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ధూలే జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.