నేడు కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు వేర్వేరుగా సమావేశం కానున్నాయి. నీటి పంపిణీ తదితర అంశాలపై చర్చించనున్నారు. కృష్ణా బోర్డు కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం మేరకు హైదరాబాద్ నుంచి అమరావతికి తరలించడం, 2019-20 సంవత్సరానికి నీటి కేటాయింపులు, రెండో దశ టెలిమెట్రీ, బోర్డుల నిర్వహణకు సంబంధించిన పనుల విషయం, రాష్ట్రాల నుంచి నిధుల విడుదలలో ఆలస్యం తదితర అంశాలపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు చర్చించనుంది.
ఇక గోదావరి బోర్డు సమావేశంలో వర్కింగ్ మాన్యువల్తో పాటు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, ఎగవ సీలేరు, దిగువ సీలేరులో విద్యుత్తు వివాదం, ఒడిశా ప్రభుత్వం చేపట్టిన మద్య కొలాబ్ ప్రాజెక్టు గురించి చర్చించనున్నారు. తెలంగాణ రాష్ట్ర సూచన మేరకు గోదావరి నీటిని చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా పెన్నాకు మళ్లించే పథకం, పోలవరం వెనుక జలాల ప్రభావం, ఏపీ సూచన మేరకు తెలంగాణ 45,131 టీఎంసీలతో కొత్త ప్రాజెక్టులను చేపట్టిందన్న అంశాన్ని సమావేశం ఎజెండాలో చేర్చారు.