విజయవాడ, సూర్య బ్యూరో : డా.బి.ఆర్.అంబేద్కర్ 126వ జయంతి మహోత్సవం పురస్కరించుకుని విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పెద్ద ఎత్తున ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టరు బాబు. ఎ. తెలిపారు గురువారం సాయంత్రం జిల్లా కలెక్టరు, జాయింటు కలెక్టరు గంధం చంద్రుడు, నగరపాలక సంస్థ కమీషనరు జి. వీరపాండ్యన్, సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు, ఎల్.డి.యం, బ్యాంకర్లతో కలిసి అంబేద్కర్ విగ్రహం, తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించే ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సంద ర్బంగా కలెక్టరు మాట్లాడుతూ శుక్రవారం కళాక్షేత్రం వద్ద ఉన్న డా. బి. ఆర్. అంబేద్కర్ విగ్రహానికి రాష్ర్ట ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి, ఐ.టి. శాఖామాత్యులు నారా లోకేష్లతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, దళితసంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తారన్నారు. అనంతరం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన డా. బి.ఆర్. అంబేద్కర్ 126వ జయంతి మహోత్సవ సభలో ఉప ముఖ్య మంత్రి, గ్రామీణాభివద్ధి శాఖామాత్యులు, ప్రజాప్రతినిధులు, దళిత సంఫూల నాయకులు పాల్గొని ప్రసంగిస్తారన్నారు. అంబేద్కర్ జయంతి సందర్బంగా భారత ప్రధాన మంత్రి నరేంద్రమోడి నాగపూర్లో నిర్వహించే డిజిధన్ తుది మేళాలో పాల్గొంటారన్నారు. ఈ సందర్బంగా నగదు రహిత లావాదేవీల్లో లక్కిగ్రహక్ యోజన, డిజిధన్ వ్యాపార యోజనలో గెలుపొందినవారికి ప్రధాన మంత్రి అవార్థులు ప్రధానం చేస్తారన్నారు.
ప్రధాని మంత్రి పాల్గొనే కార్యక్రమాన్ని నాగపూర్ నుండి లైవ్ టెలికాస్ట్, వెబ్ కాస్టింగ్ ద్వారా తుమ్మలపల్లి కళా క్షేత్రంలో వీక్షించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టరు తెలిపారు. ఈ కార్యక్రమానికి లక్కీగ్రహక్ యోజన, లక్కీ వ్యాపార గ్రహక్ యోజనలో బహుమతులు పొందిన లబ్దిదారులతోపాటు వివిధ దళిత సంఘాల నాయకులు తదితరులు పెద్దఎత్తున పాల్గొంటారని జిల్లా కలెక్టరు బాబు.ఎ. తెలిపారు.