హైదరాబాద్: కొన్ని గంటల్లో ఐపీఎల్ ప్రారంభ వేడుకలు మొదలుకానున్నాయి. వేసవిలో క్రికెట్ అభిమానులకు అసలైన ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. బుధవారం సన్ రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్ల మధ్య ఆరంభ మ్యాచ్కు ఉప్పల్ స్టేడియం ఆతిథ్యం ఇస్తోంది. స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, ఏబీ డివిలియర్స్ లేకుండానే బెంగళూరు బరిలో దిగనుంది. మరోవైపు తొలి మ్యాచ్కు సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు పూర్తిగా సన్నద్ధమయ్యారు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కలిసొచ్చే అంశం ఏంటంటే ఆటగాళ్లంతా పూర్తి ఫిట్నెస్తో ఉన్నారు. మరి కొన్ని గంటల్లో తొలి మ్యాచ్ ఆరంభం కానున్న నేపథ్యంలో ఎవరెవరో తుది జట్టులో చోటు దక్కించుకునే దానిపై ఉత్కంఠ నెలకొంది. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు అటు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పటిష్టంగా ఉంది. వార్నర్, ధావన్, యువరాజ్ సింగ్ లాంటి హిట్టర్లు ఈ జట్టులో ఉన్నారు.
భువనేశ్వర్, నెహ్రా తదితరులతో బౌలింగ్ విభాగం కూడా బలంగానే ఉంది. ఇటీవలే భారత్తో ముగిసిన టెస్టు సిరీస్లో పరుగులు చేయడానికి ఇబ్బంది పడిన డేవిడ్ వార్నర్కు తొలి మ్యాచ్లో కఠిన పరీక్ష ఎదురు కానుంది. అయినా సరే ధావన్తో కలిసి వార్నర్ ఓపెనింగ్కు వచ్చే అవకాశం ఉంది. ఇక మూడో స్ధానంలో దీపక్ హుడా బ్యాటింగ్కు దిగే అవకాశాలు ఉన్నాయి. మిడిలార్డర్లో కీలకమైన యువరాజ్ సింగ్ నాలుగోస్థానంలో, కీపర్ నమన్ ఓజా తర్వాతి స్థానంలో బ్యాటింగ్కు రావచ్చు. లేదంటే ఓజాను టాప్ ఆర్డర్లో పంపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ఆల్రౌండర్ల విషయానికి వస్తే ఆస్ట్రేలియా ఆటగాళ్లు హెన్రిక్స్, తమిళనాడుకు చెందిన విజయ్ శంకర్ తుది జట్టులో చోటు దక్కించుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. బంగ్లా ప్లేయర్ ముస్తాఫిజుర్ అందుబాటులో లేకపోవడంతో అతడి స్ధానంలో ఆప్ఘనిస్తాన్కు చెందిన మహ్మద్ నబీకి తుది జట్టులో చోటు దక్కించుకోనున్నాడు. ఇక హైదరాబాద్ పిచ్ స్పిన్కు అనుకూలించే అవకాశం ఉండటంతో ఆప్ఘనిస్థాన్కు చెందిన రషీద్ ఖాన్, మహ్మద్ నబీ, ప్రవీణ్ తాంబే ఎవరో ఒకరికి చోటు దక్కొచ్చు. ఇక పేస్ బౌలింగ్ విభాగం నుంచి భువనేశ్వర్, నెహ్రాలకు చోటు దక్కడం ఖాయం. తొలి మ్యాచ్ తర్వాత బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ జట్టులోకి వస్తాడని కోచ్ టామ్ మూడీ అన్నాడు.