(విజయవాడ, సూర్య బ్యూరో):భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మకమైన వ్యవసాయ విస్తరణసాంకేతిక విజ్ఞానంపై జాతీయపథకంలో భాగంగా ప్రభుత్వం ప్రణాళికలేకుండా నిధులను కేటాయించడంపై కాగ్ కన్నెర్ర చేసింది. 201516లో చేసిన కేటాయింపులు రూ. 46.10 కోట్లకు గాను రూ. 34.70 కోట్లు రీ అప్రోప్రియేషన్ చేసి రూ. 80.79 కోట్లు ఖర్చు చేశారు. మొక్కలు సంరక్షణ, మొక్కల క్వారంటైన్కు సంబంధించిన ఉప పథకం క్రింద గుంటూరు జిల్లాలో పురుగుమందు అవశేషాల పరీక్షా కేంద్రం ఏర్పాటు కోసం రూ. 6.64 కోట్లు విడుదల చేసినట్లు కాగ్ ఆడిట్లో గమనించింది. అయితే 2016 సెప్టెంబర్ నాటికి ఎటువంటి ప్రయోగశాలను ఏర్పాటుచేయకుండా పిడి ఖాతాలో ఈ మొత్తాన్ని వృధాగా వుంచినట్లు గుర్తించింది. సరిహద్దులు నిర్ణయించి భూ బదలాయింపు జరిగిన వెంటనే మొత్తం రూ. 6.64 కోట్లను వినియోగిస్తామని ప్రభుత్వం తెలిపింది. అలాగే సుస్థిర వ్యవసాయం కోసం జాతీయ పథకం క్రింద రూ. 168.17 కోట్లు కేటాయించి రీ అప్రోప్రియేషన్ ద్వారా రూ. 367.43 కోట్లు అదనపు కేటాయింపులు చేశారు. ఈ పథకంపై మొత్తం రూ. 535.60 కోట్లు ఖర్చు చేశారు. 2016 జనవరిలో సమర్పించిన సవరించిన వార్షిక కార్యాచరణ ప్రణాళికను ప్రభుత్వం ఆమోదించని కారణంగా ఈ ప్రాజెక్ట్ ప్రారంభానికి నోచుకోలేదు. వ్యవసాయ రుణ విముక్తి పథకం కోసం బడ్జెట్లో రూ. 4,300 కోట్లు కేటాయింపులుచేసి అందులో రూ. 743.52 కోట్లు మ్త్రామే ఖర్చుచేసి మిగిలిన రూ. 3,557.68 కోట్ల మొత్తాన్ని ఇతర పద్దులకు రీ అప్రోప్రియేషన్ చేశారు. ఉద్యాన పంటల రుణ విముక్తి పథకం క్రింద 201516 సంవత్సరాలలో నిధులు ఏవీ కేటాయించలేదు. 201516లో రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ప్రాజెక్టుల అమలు కోసం రూ. 175.46కు కేటాయించి రీ అప్రోప్రియేషన్ ద్వారా రూ. 150.63 కోట్ల అదనపు మొత్తాన్ని సమకూర్చారు. ఒక ప్రత్యేక పథకం కోసం ఉద్దేశించిన నిధులను మళ్ళించడం వల్ల ఆమేరకు లక్ష్యాలను సాధించలేకపోయినట్లు కాగ్ గుర్తించింది. అలాగే జాతీయ ఉద్యాన పంటల పథకానికి నిధులు అందుబాటులో వున్నప్పటికీ పథకాలను ప్రారంభించలేకపోవడం వల్ల అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోయారు. వార్షిక కార్యాచరణ ప్రణాళికను రూ. 119.16 కోట్లకు మార్పు చేశారు. అయినప్పటికీ కొంత నిధులు ఈ సంవత్సరంలో విడుదల కాలేదు. అలాగే బడ్జెట్లో రాబడులు, ఖర్చులను వర్గీకరించడంలోని దోషాల ఫలితంగా పద్దుల్లో కూడా వాటి వర్గీకరణలో తప్పులు దొర్లుతున్నాయని పేర్కొంది. ఈ లోటుపాట్లను సరిదిద్దేందుకు గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చినా ప్రయోజనం లేకపోవడాన్ని తప్పుపట్టింది. అలాగే పటిష్టమైన ఆర్థిక నిర్వహణకు ముందస్తు ప్రణాళిక, రాబడులు, వ్యయాల ఖచ్చితమైన అంచనాలు వుండాలని కాగ్ సూచించింది. భారీ మిగుళ్ళకు దారి తీసిన అవాస్తవికమైన బడ్జెట్ కేటాయింపులు, అనవసరమైన అనుబంధ గ్రాంట్లు, కేటాయింపులు లేకుండా చేసిన ఖర్చులు అసంబద్దమైన కేటాయింపులు బడ్జెట్ నిర్వహణ పేలవంగా వుందని కాగ్ పేర్కొంది. కొత్త రాజధాని ప్రాంతం కోసం అత్యవసరమైన పట్టణ మౌళిక సదుపాయాల కల్పన కోసం ప్రత్యేక ఆర్థిక సహాయం క్రింద కేంద్రం రూ. వెయ్యికోట్లు విడుదల చేసినా ఏ ఖర్చు జరగలేదు.