ఆంధ్రప్రదేశ్లో అధికార పగ్గాలు చేపట్టిన టీడీపీ కూటమి ప్రభుత్వం పాలనపై దృష్టిపెట్టింది. అలాగే వైసీపీ ప్రభుత్వ హయాంలోని పలు పథకాల పేర్లను టీడీపీ కూటమి ప్రభుత్వం మార్చింది. ఈ మేరకు మంత్రి డోల బాల వీరాంజనేయస్వామి ఆదేశాలు జారీచేశారు. మొత్తం ఆరు ప్రభుత్వ పథకాల పేర్లను మార్చారు. మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేర్ల స్థానంలో మార్పులు చేశారు. నాలుగు సంక్షేమ పథకాలకు సాధారణ పేర్లు ఉంచిన టీడీపీ ప్రభుత్వం.. ఒక పథకానికి సీఎం చంద్రబాబు నాయుడు పేరు, మరో పథకానికి మాజీ ముఖ్యమంత్రి, దివంగత ఎన్టీఆర్ పేరును చేర్చారు.
విద్యార్థులకు అందించే జగనన్న విద్యాదీవెన పథకం పేరును పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ గా ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం మార్చింది. అలాగే జగనన్న వసతి దీవెన పథకానికి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ అంటూ నామకరణం చేసింది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు ఆసరా అందించే.. జగనన్న విదేశీ విద్యా దీవెన పథకానికి అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధిగా పేరు మార్చారు. అలాగే పెళ్లి చేసుకునే యువతులకు అర్థిక సాయం అందించే వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకానికి చంద్రన్న పెళ్లికానుకగా పేరు మార్చారు. ఇక వైఎస్ఆర్ విద్యోన్నతి పథకం పేరును ఎన్టీఆర్ విద్యోన్నతిగా, జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం పేరును.. ఇన్సెంటివ్స్ ఫర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్గా మార్చారు. ఈ మేరకు మంత్రి ఉత్తర్వులు జారీ చేశారు.
అయితే చంద్రన్న పెళ్లికానుక పథకాన్ని 2014లో అధికారంలోకి వచ్చిన సమయంలోనే చంద్రబాబు నాయుడు అమలు చేశారు. ఎస్సీ,ఎస్టీ , బీసీ సామాజికవర్గాల్లోని యువతులకు పెళ్లి సమయంలో ఆసరాగా నిలిచేందుకు వారికి ఆర్థిక సాయం అందించేలా చంద్రన్న పెళ్లికానుక పేరుతో అప్పట్లో పథకం ప్రవేశపెట్టారు. అయితే 2019 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన వైసీపీ.. పలు పథకాలను పేర్లను మార్చింది. ఈ నేపథ్యంలో గతంలో తాము అధికారంలో ఉన్న సమయంలో ప్రవేశపెట్టిన పథకాలకు పాత పేర్లను తిరిగి పెట్టాలని టీడీపీ ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే ఈ మార్పులు చేసినట్లు తెలిసింది.