రాష్ట్రంలో గంజాయి నియంత్రణకు ప్రత్యేక టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేస్తున్నట్టు హోంమంత్రి వంగలపూడి అనిత ప్రకటించారు. గంజాయి నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై సర్క్యూట్ హౌస్లో జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జున, విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్, జాయింట్ సీపీ ఫకీరప్పతోపాటు నగరంలోని పైస్థాయి పోలీస్ అధికారులతో సోమవారం ఆమె సమీక్ష నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అనిత మాట్లాడుతూ... వైసీపీ ప్రభుత్వ హయాంలో విశాఖ గంజాయి, మాదక ద్రవ్యాలకు రాజధానిగా మారిపోయిందన్నారు. యువతకు గంజాయి సులభంగా దొరుకుతోందని, ఆ మత్తులో వారు దోపిడీలు, చైన్స్నాచింగ్లు, ఈవ్టీజింగ్ వంటి నేరాలకు పాల్పడుతున్నారని అన్నారు. ఏపీని గంజాయి రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించానన్నారు. హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టకముందే నగరంలోని పోలీస్ అధికారులతో సమావేశం ఏర్పాటుచేసి దీనికి సంబంధించిన ఆదేశాలు జారీ చేశానన్నారు. చెక్పోస్టుల సంఖ్య పెంచడంతోపాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పోలీసులకు స్పష్టంగా చెప్పానన్నారు. టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటుచేసి నగరంలో రాత్రిపూట గుంపుగా ఉండే యువతను, బస్టాపుల్లో కనిపించే ఆకతాయిలను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించాలని, సోమవారం నుంచే ఈ ప్రక్రియ ప్రారంభం కావాలని ఆదేశాలిచ్చినట్టు తెలిపారు. గంజాయి కేసుల్లో పట్టుబడేవారు ఏ పార్టీవారైనా, చివరకు టీడీపీ వారైనా సరే క్షమించేది లేదని హెచ్చరించారు. గంజాయి డీ అడిక్షన్ సెంటర్లు పెంచడంతోపాటు, కేజీహెచ్లో ప్రత్యేకంగా ఒక బ్లాక్ను కేటాయించే ప్రతిపాదన ఉందన్నారు. మూడు నెలల్లో గంజాయికి పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేస్తామని చెప్పారు. ఇకపై దిశ పోలీస్ స్టేషన్ల పేరును మహిళా పోలీస్ స్టేషన్గా మార్చేస్తామని హోంమంత్రి అన్నారు.