నరసాపురం బీజేపీ ఎంపీ, భూపతిరాజు శ్రీనివాస వర్మ కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రిగా తన ఛాంబర్లో సంతకం చేసి బాధ్యతలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు ఏపీ బీజేపీ ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, అరమిల్లి రాధాకృష్ణ, బొలిశెట్టి శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, సోము వీర్రాజు, రమేశ్ నాయుడు , మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుతో పాటు పలువురు పాల్గొన్నారు. కాగా భూపతిరాజు శ్రీనివాస వర్మ బీజేపీలో సామాన్య కార్యకర్త స్థాయి నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఈ ఎన్నికల్లో నరసాపురం లోక్సభ స్థానం నుంచి విజయం సాధించారు. 1967 ఆగస్టు 4న జన్మించిన ఆయనకు రొయ్య సాగు, వాణిజ్యంలో 20 ఏళ్లు, రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగంలో 30 ఏళ్ల అనుభవం ఉంది. 1991 నుంచి 95 వరకు బీజేవైఎం జిల్లా అధ్యక్షుడిగా, 1995 నుంచి 97 వరకు పార్టీ భీమవరం పట్టణ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2009లో బీజేపీ తరఫున ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు. గత ఏడాది వరకు బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. టీడీపీ-జనసేన కూటమి మద్దతుతో నరసాపురం ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి వైసీపీ అభ్యర్థిపై 2.76 లక్షల ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు.