ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అప్పుడే డ్యూటీ మొదలెట్టిన టీడీపీ ఎంపీ.. రాత్రిపూట ఆకస్మిక తనిఖీలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 15, 2024, 08:07 PM

దేశంలో సార్వత్రిక ఎన్నికల కోలాహలం ముగిసింది. అలాగే ఏపీలోనూ ఎన్నికల సందడి ముగిసి ప్రభుత్వం ఏర్పాటైంది. అయితే చాలా మంది ఎమ్మె్ల్యేలు, ఎంపీలుగా గెలిచిన నేతలు ఇంకా గెలుపు సంబరాల్లో ఉండగా.. టీడీపీ ఎంపీ మాత్రం అప్పుడే పని మొదలెట్టేశారు. విజయనగరం టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు.. మెట్టవలసలోని హాస్టల్‌ను పరిశీలించారు. రాత్రి పూట అక్కడే నిద్రించి.. హాస్టల్‌లో ఉన్న సౌకర్యాలు, వసతులను పరిశీలించారు. మరోవైపు ఎంపీ చేసిన పనిని స్థానికులు అభినందిస్తున్నారు. ప్రజాసమస్యల పరిష్కారానికి వెంటనే పూనుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.


దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల హడావిడి ముగిసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొలువు దీరాయి. అయితే ఇంకా చాలా మంది ప్రజా ప్రతినిధులు.. గెలుపు ఇచ్చిన ఉత్సాహంలో ఉన్నారు. ఇంకా ఆ మూడ్‌లోనే కొనసాగుతున్నారు. అయితే టీడీపీకి చెందిన ఓ ఎంపీ మాత్రం అప్పుడే డ్యూటీలోకి దిగిపోయారు. ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టి ప్రజల సమస్యలను పరిష్కరించే పనిలో పడ్డారు. విజయనగరం లోక్ సభ నియోజకవర్గం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు.. అప్పుడే డ్యూటీ మొదలుపెట్టారు. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలోని మెట్టవలస ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహాన్ని కలిశెట్టి సందర్శించారు. గురువారం రాత్రి హాస్టల్‎ను తనిఖీ చేసిన టీడీపీ ఎంపీ.. విద్యార్థులతో ముచ్చటించారు. హాస్టల్‌లో ఉన్న వసతుల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హాస్టల్ అధికారులకు, విద్యార్థులకు హామీ ఇచ్చారు. అనంతరం వారితో కలిసి ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అక్కడే బస చేశారు.


మరోవైపు కలిశెట్టి అప్పలనాయుడు. సాధారణ రైతు కుటుంబం నుంచి ఎంపీ స్థాయికి ఎదిగారు. బాల్యంలో ఇదే హాస్టల్‌లో ఉంటూ చదువుకున్నారు. దీంతో హాస్టల్‌ను ఓ సారి సందర్శించాలనే ఆలోచనతో గురవారం రాత్రి మెట్టవలస హాస్టల్‌లో బస చేశారు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన కలిశెట్టి అప్పలనాయుడు ఒకప్పుడు ఈనాడు సంస్థలో పనిచేశారు. ఆ తర్వాత రాజకీయాలవైపు అడుగులు వేశారు. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీలో కార్యకర్త నుంచి నియోజకవర్గం లీడర్ స్థాయికి ఎదిగారు. విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి పాటుపడ్డారు.


ఈ క్రమంలోనే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ప్రస్తుత ఐటీ మంత్రి నారా లోకేష్ దృష్టిని ఆకర్షించారు కలిశెట్టి అప్పలనాయుడు. ఆ విధంగా అధిష్టానం ఆశీస్సులతో ఈ ఎన్నికల్లో టీడీపీ నుంచి విజయనగరం లోక్ సభ స్థానానికి పోటీ చేశారు. ఎన్నికల్లో సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్‌ మీద.. 2,38,216 ఓట్ల మెజారిటీతో కలిశెట్టి అప్పలనాయుడు ఘన విజయం సాధించారు. పార్టీ పట్ల విధేయతతో పనిచేస్తున్న కలిశెట్టి అప్పలనాయుడు.. ఇటీవల ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం కార్యక్రమంలోనూ నెట్టింట వైరల్ అయ్యారు. గ్యాలరీల్లో కేరింతలు కొడుతున్న వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com