ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యాశాఖపై నారా లోకేష్ ఫోకస్.. ఇంటర్ పుస్తకాల పంపిణీపై కీలక ఆదేశాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 15, 2024, 07:56 PM

ఏపీలో నూతన ప్రభుత్వం కొలువుదీరింది. చంద్రబాబు ఇప్పటికే సీఎంగా బాధ్యతలు స్వీకరించి యాక్షన్ లోకి దిగగా.. మంత్రులు కూడా ఒక్కొక్కరుగా బాధ్యతలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే ఐటీ, కమ్యూనికేషన్స్, విద్యాశాఖ మంత్రిగా నియమితులైన నారా లోకేష్ సైతం పని మొదలెట్టారు. విద్యాశాఖపై మంత్రి నారా లోకేష్ శనివారం సమీక్ష నిర్వహించారు. పాఠశాలల్లో డ్రాప్ అవుట్స్ అంశంతో పాటుగా, మౌలిక సదుపాయాలపై విద్యాశాఖ ఉన్నతాధికారులతో చర్చించారు. అలాగే ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు జులై 15 నాటికల్లా పాఠ్యపుస్తకాలు అందజేయాలని నారా లోకేష్ నిర్ణయించారు. ఈ నిర్ణయానికి అనుగుణంగా అప్పటికల్లా విద్యార్థులకు పుస్తకాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.


అలాగే ఏడాదిలోగా ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తి స్థాయి మౌళిక సదుపాయాలు కల్పించాలని నారా లోకేష్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. కొత్తగా చేపట్టాల్సిన పనులతో పాటుగా స్కూళ్లల్లో అర్ధాంతరంగా నిలిచినపోయిన పనులను ఏడాదిలోపు పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. ఇక మధ్యాహ్న భోజనం నాణ్యతపైనా ఆరా తీసిన నారా లోకేష్.. రుచి, నాణ్యత సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పాఠశాలల్లో పారిశుద్ధ్యం నిర్వహణపై అధ్యయనం చేయాలని అధికారులకు మంత్రి నారా లోకేష్ సూచించారు.


ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్‌కు మానవ వనరుల అభివృద్ధి శాఖ, ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖలను కేటాయించారు. ఈ నేపథ్యంలో విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన నారా లోకేష్.. జులై15 నాటికల్లా ఇంటర్ విద్యార్థులకు టెక్ట్స్ బుక్స్ అందించాలని.. ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. 2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి ఓడిపోయిన నారా లోకేష్.. 2024 ఎన్నికల్లో మళ్లి అక్కడే పోటీచేసి ఏకంగా 90 వేల మెజారిటీతో గెలుపొంది మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com