ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కడపలో ఆసక్తికర ఘటన.. లక్ అంటే వీళ్లదే, ఏకంగా రూ.లక్షల్లో

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 21, 2024, 08:25 PM

కడపలో ఆసక్తికర ఘటన జరిగింది. రైలులో పోగొట్టుకున్న విలువైన వస్తువులను రైల్‌ మదద్‌ సాయంతో మళ్లీ దొరికాయి. వెంటనే ప్రయాణికుడికి ఫోన్ చేసి సమాచారం అందించి తిరిగి అప్పగించారు. ఈ నెల 18వ తేదీన రాత్రి కర్ణాటకలోని హోస్‌పేటకు చెందిన నీరజ్‌కుమార్‌ కుటుంబ సభ్యులతో కలిసి రేణిగుంట స్టేషన్‌కు హరిప్రియ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కడానికి వచ్చారు. ఈ కుటుంబం ముందుగా వారి మూడు బ్యాగులను ఏ-1 బోగీలో ఉంచారు. ప్లాట్‌ఫాం మీద ఉన్న మిగతా కుటుంబ సభ్యులను ఎక్కించేందుకు నీరజ్‌ కుమార్‌ దిగారు. ఈలోపు ఆ రైలు అక్కడి నుంచి కదిలింది.


నీరజ్ కుమార్ వెంటనే అప్రమత్తం అయ్యారు.. రైల్‌ మదద్‌(139)కు ఫోన్‌ చేసి జరిగినదంతా చెప్పి వివరాలు ఇచ్చారు. వెంటనే రైల్వే కంట్రోల్‌ రూం అధికారులు అలర్ట్ అయ్యారు.. వారు కడప ఆర్‌పీఎఫ్‌ అధికారులకు సమాచారం అందజేశారు. ఈ రైలు కడపకు రాగానే ఆర్‌పీఎఫ్ పోలీసులు ఆ హరిప్రియ ఎక్స్‌ప్రెస్‌ ‌రైలులోని ఎ-1 కోచ్‌లో ఉన్న బ్యాగులను దించి రైల్వే పోలీస్ స్టేషన్‌లో ఉంచారు. వెంటనే ఈ సమాచారాన్ని బాధితుడు నీరజ్‌కుమార్‌కు ఫోన్ చేసి తెలపగా.. ఆయన సోమవారం వచ్చి తనకు సంబంధించి ఆధారాలు చూపించడంతో ఆ లగేజీని తిరిగి అప్పగించారు. మొత్తం మూడు బ్యాగుల్లో రూ.1,20,000 డబ్బులతో పాటుగా బంగారు, వెండి ఆభరణాలు, ఇతర వస్తువులు ఉన్నాయి. తాను రైల్ మదద్ ద్వారా సమాచారం ఇవ్వగానే స్పందించిన కడప ఆర్‌పీఎఫ్‌ అధికారులకు నీరజ్‌కుమార్‌ ధన్యవాదాలు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com