ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందని, ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి కట్టడి చేయాలని ఆదేశించందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్జీటీ ఆదేశించినా ఇసుక తవ్వకాలు ఆగడం లేదని విమర్శించారు. ఇసుకను దోచుకుని తాడేపల్లి ప్యాలెస్కు రూ. 40 వేల కోట్లు తరలిస్తున్నారని ఆరోపించారు. డీఎమ్జీ, పెద్దిరెడ్డి కనుసన్నల్లో ఇసుక దోపిడీ జరుగుతోందన్నారు. ఇసుక దోపిడీపై దున్నపోతు మీద వర్షం పడినట్లు అధికారులు వ్యవహరిస్తున్నారన్నారు. సుప్రీం హెచ్చరించిన పట్టించుకోని అధికారులు... నేడు కూడా దవళేశ్వరం వద్ద అక్రమ తవ్వకాలు చేపట్టారని మండిపడ్డారు. జగన్ రెడ్డి తాబేదారులు ఎక్కడికి పారిపోలేరని... తిన్నది నిలబెట్టి కక్కిస్తామని హెచ్చరించారు. తొత్తులుగా వ్యవహరిస్తూ దోపిడీకి సహకరించిన అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. అధికార మార్పు తథ్యం... అక్రమార్కులకు జైలు శిక్ష ఖాయమని నక్కా ఆనందబాబు స్పష్టం చేశారు.