ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాపై దుష్ప్రచారం.. వాళ్లపై పరువు నష్టం దావా వేస్తా: గంటా శ్రీనివాసరావు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 26, 2024, 08:32 PM

టీడీపీ జనసేన పార్టీల అభ్యర్థుల తొలి జాబితా వచ్చేసింది.. పార్టీలో సీనియర్లు చాలామందికి టికెట్ ఇంకా స్పష్టత రాలేదు. ఈ లిస్ట్‌లో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఉన్నారు. ఈ క్రమంలో గంటా అధినేత చంద్రబాబును కలిశారు.. తాజా పరిణామాలపై చర్చించారు. విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి నుంచి పోటీ చేయాల్సిందిగా గంటాకు ఆయన సూచించారు. అక్కడ టీడీపీ గెలవాల్సిన అవసరాన్ని సుదీర్ఘంగా వివరించినట్లు తెలుస్తోంది. తాను భీమిలి నుంచి పోటీకి ఆసక్తిగా ఉన్నట్టు గంటా చెప్పారు.. అయితే ఆ చర్చలు అసంపూర్తిగా ముగిశాయని చెబుతున్నారు. రెండు మూడు రోజుల్లో మళ్లీ కలుద్దామని, ఎక్కడి నుంచి పోటీ చేయాలన్నది తనకు వదిలేయాలని అధినేత పేర్కొన్నట్టు గంటా తెలిపారు.


చీపురుపల్లి నుంచి పోటీ చేయమని చంద్రబాబు కోరినట్లు గంటా తెలిపారు. భీమిలి లేదా విశాఖ జిల్లా నుంచి పోటీ చేస్తానని చెప్పానని.. 'నువ్వెక్కడ పోటీ చేసినా గెలుస్తావని' చంద్రబాబు తనతో చెప్పారన్నారు. తనను ఎక్కడి నుంచి పోటీ చేయిస్తాననే విషయాన్ని తనకు వదిలిపెట్టమని చంద్రబాబు చెప్పారన్నారు. టీడీపీ - జనసేన విడుదల చేసిన మొదటి జాబితాపై మంచి ఫీడ్ బ్యాక్ వస్తోందని గంటా అభిప్రాయపడ్డారు. తూర్పున సూర్యుడు ఉదయించడం ఎంత నిజమో.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడం కూడా అంతే నిజం అన్నారు.


ఫస్ట్ లిస్టులో పేరు లేనంత మాత్రాన సీనియర్లను అవమానించినట్టు కాదని.. పొత్తుల వల్ల కొందరికి సీట్లు దక్కకపోవచ్చు.. వారికి పార్టీ న్యాయం చేస్తుందన్నారు. పొత్తులు.. సీట్ల సర్దుబాటు అనేది టీడీపీ - జనసేన పార్టీల అంతర్గత వ్యవహరం.. వైఎస్సార్‌సీపీకి ఎందుకని ప్రశ్నించారు. ఏ ఒక్క వర్గమో కాదు.. ప్రతి వర్గమూ వైఎస్సార్‌సీపీని వ్యతిరేకిస్తోందన్నారు. వైఎస్సార్‌సీపీలో ఇమడలేక చాలా మంది ఆ పార్టీని వీడుతున్నారన్నారు. 70 మందిని ప్రకటించడానికి వైఎస్సార్‌సీపీ ఏడు లిస్టులు విడుదల చేసిందన్నారు. చంద్రబాబు తనను తిట్టారంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. అలాంటి వారిపై పరువు నష్టం దావా వేస్తానన్నారు. మరోవైపు విశాఖ దక్షిణం సీటును జనసేన ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నందున అక్కడి టీడీపీ ఇంఛార్జ్ గండి బాబ్జీ కూడా అధినేతను కలిశారు. చర్చలు సానుకూలంగా జరిగాయని, తనను పని చేసుకోవాలని చెప్పారని భేటీ అనంతరం బాబ్జీ తెలిపారు.


మరోవైపు విజయనగరం జిల్లాలో టీడీపీ టికెట్లు దక్కని నాయకుల్లో అసంతృప్తులు చల్లారలేదు. గజపతినగరం టికెట్‌ ఆశించిన మాజీ ఎమ్మెల్యే కె.ఎ.నాయుడు, పార్టీ నేత కరణం శివరామకృష్ణ ఆదివారం తమ అనుచరులతో వేర్వేరుగా సమావేశాలు, ర్యాలీలు నిర్వహించారు. పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. నెల్లిమర్ల స్థానాన్ని జనసేనకు కేటాయించడంతో అక్కడి టీడీప ఇంఛార్జ్ కర్రోతు బంగార్రాజు అనుచరులు నిరసన తెలిపారు. బంగార్రాజు రేపోమాపో చంద్రబాబును కలవనున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు టికెట్‌ను గుమ్మడి సంధ్యారాణికి కేటాయించడంపై ఆమె వ్యతిరేకవర్గంలో అసమ్మతి రేగింది. మక్కువ మండలం ఎ.వెంకంపేటలో మండల మాజీ అధ్యక్షుడు పెంట తిరుపతిరావు ఆధ్వర్యంలో 21 పంచాయతీలకు చెందిన పార్టీ నాయకులు రహస్యంగా సమావేశమయ్యారు. త్వరలో విస్తృత సమావేశం ఏర్పాటుచేసి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించాలని నిర్ణయించినట్లు సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com