తెలంగాణలో వైసీపీ కేసీఆర్కు భయపడే పోటీ చేయలేదని ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. ఇవాళ మీడియాతో దేవినేని మాట్లాడుతూ… పోలవరంపై కేసులు వేసిన వారితో జగన్ చేతులు కలుపుతున్నారని విమర్శించారు. జగన్ నేతృత్వంలో అభివృద్ధి నిరోధకులు జట్టు కడుతున్నారని ఆరోపించారు. పోలవరం నిర్వాసితులను జగన్ రెచ్చగొడుతున్నారని దేవినేని మండిపడ్డారు. పార్లమెంట్లో అవిశ్వాసంపై చర్చ సమయంలో వైసీపీ ఎంపీలు ఎక్కడున్నారని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ది జరగకూడదన్నదే వైసీపీ అధినేత వైఎస్ జగన్ లక్ష్యమని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. శరవేగంగా ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుంటే జగన్ అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారన్నారు. నాగావళి-వంశధార అనుసంధానం జగన్కు కనపడటంలేదా అని నిలదీశారు. ఏపీలో కుహనా మేధావులు ఎక్కువయ్యారని, జగన్ అసెంబ్లీకి రాకపోవడంపై మేధావులు ఎందుకు ప్రశ్నించరని మంత్రి దేవినేని ఉమా ఎద్దేవా చేశారు. ప్రభుత్వంపై బురద జల్లుతున్న కుహనా మేధావులు కోడికత్తి పార్టీలో చేరాలన్నారు. ప్రత్యేక హోదాపై జగన్ తన ఎంపీలతో నాటకాలు వేయించారని దేవినేని ఆరోపించారు.