రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించిన ఆనందం కంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో ఎదురౌతున్న తలనొప్పులే కాంగ్రెస్ అధిష్టానానికి అధికంగా ఉన్నాయి. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలలో విజయం కోసం తీవ్రంగా కష్టించిన అశోక్ గెహ్లాట్, సచిన్ పైటల్ లు సీఎం పదవి కోసం పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం సీనియర్ అయిన అశోక్ గెహ్లాట్ వైపే మొగ్గు చూపుతోందన్న వార్తల నేపథ్యంలో సచిన్ పైలట్ మద్దతు దార్లు ఆందోళన బాట పట్టారు. కరౌలి జిల్లాలో సచిన్ పైలట్ అభిమానులు రోడ్డెక్కారు. రహదారిపై బైఠాయించి తన నేతకే సీఎం అవకాశం ఇవ్వాలంటూ ధర్నాకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల సచిన్ పైలట్ కు మద్దతుగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సచిన్ పైలట్ స్వయంగా తన మద్దతు దారులకు, పార్టీ కేడర్ కు శాంతియుతంగా ఉండాలని విజ్ణప్తి చేశారు. తనకు పార్టీ అధినాయకత్వంపై సంపూర్ణ విశ్వాసం ఉందని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరన్నది పార్టీ అధినాయకత్వం నిర్ణయిస్తుందని, ఆ నిర్ణయాన్ని స్వాగతించాలని కోరారు.